బిజెపి నేతల ఎదురుదాడి
న్యూఢిల్లీ : స్వచ్ఛమైన తాగు నీరు, ఆక్సిన్, విద్యుత్ ఉత్పత్తికి విండ్ టర్బైన్లను (గాలిమరలు) ఉపయోగించవచ్చంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఓ సూచనను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఎద్దేవా చేశారు. అయితే రాహుల్ గాంధీకి సైన్స్ గురించి ఏమీ తెలియదంటూ బిజెపి నేతలు ఆయనపై ఎదురుదాడి చేశారు. ‘ భారత్కు అసలైన ప్రమాదం ఏమిటంటే ప్రధాని మోడీకి తెలియకపోవడం కాదు. ఆ విషయాన్ని ఆయనకు చెప్పగల దమ్ము ఆయన చుట్టూ ఉన్న వారిలో ఒవరికీ లేకపోవడమే’ అని రాహుల్ ఒక ట్వీట్లో వ్యాఖ్యానించారు. అంతేకాదు ఒక విండ్ ఎనర్జీ కంపెనీ సిఇఓతో ప్రధాని మోడీ మాట్లాడిన వీడియోను కూడా ఆయన దానికి జత చేశారు. కేవలం విద్యుత్ ఉత్పత్తి చేయడానికే కాకుండా ఆక్సిన్, స్వచ్ఛమైన తాగునీరును తయారు చేయడానికి కూడా విండ్ టర్బైన్లను ఉపయోగించుకోవచ్చని ప్రధాని ఆ వీడియోలో సూచించారు.
అయితే దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ మీకు అర్థంం కాదని రాహుల్కు చెప్పే ధైర్యం ఆయన చుట్టూ ఉన్న వారిలో ఎవరికీ లేదు. ప్రధానిచేసిన సూచలను ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒకటైన కంపెనీ సిఇఓ మెచ్చుకుంటే రాహుల్ మాత్రం ఎద్దేవా చేస్తున్నారు’ అని గోయల్ ఒక ట్వీట్లో వ్యాఖ్యానించారు. అంతేకాదు, విండ్ టర్బైన్లు పలచటి గాలినుంచి నీటిని సృష్టిస్తాయన్న ఒక వార్తా కథనాన్ని కూడా ఆయన తన ట్వీట్కు జత చేశారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా ఇదే విధమైన ట్వీట్ చేశారు.‘ రాహుల్జీ రేపు ఉదయం నిద్ర లేచి నేను జత చేసిన శాస్త్రీయ పరిశోధనా పత్రాలను చదవండి. ఈ అంశం ఎంత సంక్లిష్టమైందో మీకు అర్థం కాదని నాకు తెలుసు..’ అని ఆయన తన ట్వీట్లో దుయ్యబట్టారు. బిజెపి సోషల్ మీడియా విభాగం చీఫ్ అమిత్ మాలవీయ కూడా రాహుల్ ట్వీట్పై మండిపడ్డారు.