ఎస్సిఓ సభలో చైనాకు రాజ్నాథ్ హితవు
మాస్కో: పరస్పర విశ్వాసం, ఘర్షణ లేని వాతావరణం, అంతర్జాతీయ నియమనిబంధనల పాటింపు, విభేధాలను శాంతిపూర్వకంగా పరిష్కరించుకోవడం వంటి చర్యల వల్లే షాంఘై సహకార సమితి(ఎస్సిఓ) సభ్య దేశాలలో శాంతి, భద్రతలు సాధ్యమవుతాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం జరిగిన ఎస్సిఓ మంత్రివర్గ స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తూర్పు లడఖ్లో భారత్తో సరిహద్దు ఘర్షణలకు దిగుతున్న చైనాపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఒక దేశంపై మరో దేశం దురాక్రమణలకు పాల్పడితే దాని వల్ల ప్రపంచానికి జరిగే అనర్థాలను ఆ యుద్ధ జ్ఞాపకాలు నేర్పుతాయని అన్నారు. ఎస్సిఓలో మొత్తం ఎనిమిది సభ్య దేశాలు ఉన్నాయి. ప్రాంతంలో భద్రత, శాంతికి సంబంధించిన సమస్యలపైనే ఎస్సిఓ ప్రధానంగా దృష్టి పెడుతోంది. ప్రపంచ జనాభాలో 40 శాతం జనాభా ఎస్సిఓ సభ్య దేశాలలోనే ఉందని, పరస్పర విశ్వాసం, సహకారం వల్లే ప్రాంతంలో శాంతి, భద్రతలు సాధ్యపడతాయని రాజ్నాథ్ అన్నారు. చైనా విదేశాంగ మంత్రి జనరల్ వీ ఫెంగే సమక్షంలో రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.