Tuesday, April 30, 2024

కడుపు మండి.. గుండె రగిలి

- Advertisement -
- Advertisement -

పరీక్ష రద్దయిందనే తిరుగుబాటు

కేంద్రం నిర్లక్షం.. వ్యాప్తంగా లక్షా 10వేల మంది
ఉద్యోగార్థుల అలజడి రాష్ట్రంలో 3వేల మంది ఆర్మీ పరీక్ష కోసం ఎదురు చూపు పిడుగు పాటులా ‘అగ్నిపథ్’
రగిలిన యువకులు రైల్వేస్టేషన్ల విధ్వంసం, హింస
ఏడు రాష్ట్రాల్లో నిరసన, 11 దగ్ధం, కాల్పులు
110 రైళ్ల రద్దుకు కారణం పరీక్ష నిర్వహించకపోవడమే

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో 42 కేంద్రాల్లో నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో ఎంపికై రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్న ఆర్మీ ఉద్యోగార్థుల గుండె మంటే ఏడు రాష్ట్రాల్లో రైల్వేస్టేషన్ల, విధ్వంసం, హింస, కాల్పులకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. 2021 మార్చిలో దేశంలోని 43 ఆర్మీ రిక్రూట్‌మెంట్ కేంద్రాల్లో నిర్వహించిన మెడికల్, ఫిజికల్ పరీక్షల్లో అర్హత సాధించి ఏడాదిన్నరగా రాత పరీక్షను నిర్వహించక పోగా ఆ పరీక్షను అగ్నిపథ్‌తో రద్దు చేశారనే ప్రచారం జరగడంతోనే ఉద్యోగార్థులు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రంగాని, ఆర్మీ అధికారులు గాని ఏడాదిన్నరగా దేశ వ్యాప్తంగా అర్హత సాధించిన లక్షా 10 వేల మంది అభ్యర్థులకు నిర్వహించాల్సిన రాత పరీక్షను ఏడాదిన్నరగా వాయిదా వేస్తూ వస్తున్నారు.

దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో లక్షలాది మంది ఫిజికల్ , మెడికల్ పరీక్షలకు హాజరయ్యారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌లో అర్హత సాధించడానికి యువకులు ఎంతగానో శ్రమించారు. రాత్రిపగలూ తేడా లేకుండా ఆర్మీలో చేరాలని తపన పడి పరీక్షల్లో నెగ్గి రాత పరీక్ష కోసం ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నారు. అధికారులు తొలుత పరీక్ష నిర్వహించకపోవడానికి కొవిడ్‌ను సాకుగా చూపారు. ఆ తర్వాత త్వరలో పరీక్ష అంటూ వెబ్‌సైట్‌లో ప్రకటనలు చేశారు. రాత పరీక్షలో నెగ్గితే తమకు ఉద్యోగం వస్తుందని, కుటుంబం కష్టాలు తీరుతాయనే ఉద్యోగార్థులు ఆశపడ్డారు. కాని ఉరుములేని పిడుగులా మూడు రోజుల క్రితం అగ్నిపథ్ ప్రకటన వచ్చింది. దీని ప్రకారం ఉద్యోగం తాత్కాలికమని, వచ్చే వేతనం తక్కువేనని ప్రకటన రావడం, ఆ తర్వాత ఇక ఆర్మీ ర్యాలీ పరీక్ష వుండదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఇక ఉద్యోగార్థులంతా అగ్నిపథ్‌లోనే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, పాత పరీక్షలు రద్దయినట్టేనని అనధికార ప్రచారం అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు, మానసిక క్షోభకు గురి చేసింది. ఇన్నాళ్ల తమ కష్టం బూడిదపాలేనా, ఆర్మీలో పర్మినెంట్ ఉద్యోగం రాదా అనే అలజడి, భయం అందరిలో ఏర్పడింది. అగ్నిపథ్ ప్రకటన వచ్చిన మరుసటి రోజు ఉత్తరాది రాష్ట్రాలు భగ్గుమన్నాయి. అక్కడి ఉద్యోగార్థులు కూడా ఇక తమకు ఆర్మీ ఉద్యోగం కల కల్లలైందనే ఆందోళనతో అక్కడ రైల్వే స్టేషన్లను తగులబెట్టారు. అదే రీతిలో రాష్ట్రంలో అర్హత సాధించిన 3000 మంది అభ్యర్థులు వాట్సాప్ గ్రూప్‌లో సమూహంగా ఏర్పడి సమాచార మార్పిడితో పథకం ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తగులబెట్టారు. విధ్వంసం చివరకు కాల్పులకు దారి తీసి ఒకరి మృతి, అనేక మంది గాయాలకు కారణమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News