అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా రాయచోటికి చెందిన బాషాభాయ్ అనే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో బెంగళూరులోని కటిగనహళ్లి ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని భారీ మొత్తంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతర్జాతీయ స్మగర్ల్ హసన్కు ప్రధాన అనుచరుడైన బాషా ఎపిలో రాయలసీమ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా నరికి విదేశాలకు తరలించి వందలాది కోట్ల రూపాయలు అర్జించినట్లు పోలీసు అధికారులు వివరించారు. కడప జిల్లాలోని అటవీ ప్రాంతాలు, స్థానిక గ్యాంగులను ఏర్పాటు చేసుకుని 2015లో కడప జిల్లాలో సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం తరలిస్తూ దొరికాడు. ఐదేళ్ల కాలంలో సుమారు వెయ్యి టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు రికార్డుల్లో ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో 62 స్మగ్లింగ్ కేసులున్నాయి.
ఇదిలావుండగా పులివెందుల కోర్టు బాషాతోపాటు ఆరుమంది కడప జిల్లా స్మగ్లర్లకు మూడేళ్ల జైలుశిక్ష, పది వేలు జరిమానా విధించించడంతో మూడేళ్ల తరువాత విడుదలై బెంగళూరుకు తన స్థావరాన్ని మార్చాడు. ఈక్రమంలో బెంగళూరులోని కటిగనహళ్లిలోని తన డెన్లో కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం నిల్వలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేశారు. ఆకస్మిక దాడికి కౌంటర్గా బాషా గ్యాంగ్ పోలీసులపై తెగబడి రాళ్లతో దాడికి పాల్పడింది. అయితే ఎట్టకేలకు బాషాతోపాటు అయిదు మంది అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని నిల్వ ఉంచిన ఐదు కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కడప శివారులోని వల్లూరు మండలం గోటూరు వద్ద జరిగిన ప్రమాద ఘటనలో ఐదుగురు తమిళ కూలీలు మృత్యువాత పడటంలో బాషాగా కీలక పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందాలు బెంగళూరు వెళ్లి అదుపులోకి తీసుకున్నాయి. స్థానిక లోకల్ హైజాక్ గ్యాంగ్ సాయంతో బాషాను అదుపులోకి తీసుకున్నారు. కడప శివారులోని రహస్య ప్రదేశంలో ప్రస్తుతం విచారిస్తున్నారు.