తొలి మూడు ర్యాంకులు వారివే..
టాప్ టెన్లో 4 నుంచి 10 ర్యాంకుల్లో అబ్బాయిలు
నీట్లో జాతీయస్థాయి 3వ ర్యాంకర్ స్నిఖితకు ఎంసెట్లోనూ 3వ స్థానం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలలో మొదటి మూడు ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన గుత్తి చైతన్య సింధు 151.8981 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. అలాగే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్కు చెందిన బారెడ్డి సాయిత్రిషా రెడ్డి 151.8384 మార్కులతో రెండవ ర్యాంకు, రంగారెడ్డి జిల్లా మంచిరేవులకు చెందిన తుమ్మల స్నిఖిత మూడవ ర్యాంకు సాధించారు. నీట్ ఫలితాలలో జాతీయస్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన తుమ్మల స్నిఖిత రాష్ట్ర అగ్రికల్చర్ ఎంసెట్లో కూడా మూడవ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఉన్నత విద్యామండలి టి.పాపిరెడ్డి శుక్రవారం జెఎన్టియుహెచ్లో అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఆర్.లింబాద్రి, ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్, జెఎన్టియుహెచ్ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ టి.పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాల వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 28,29 తేదీలలో జరిగిన అగ్రికల్చర్ ఎంసెట్కు 78,981 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 63,857 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 59,113 మంది విద్యార్థులు ఉత్తీర్ణత( 92.57 శాతం) సాధించారు. ఈ ఏడాది కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంజనీరింగ్ ఎంసెట్, అగ్రికల్చర్ ఎంసెట్లను వేర్వేరుగా నిర్వహించారు.
అగ్రికల్చర్ ఎంసెట్ టాప్ టెన్ ర్యాంకర్లు వీరే
1. గుత్తి చైతన్య సింధు (గుంటూరు, ఆంధ్రప్రదేశ్)
2. మారెడ్డి సాయి త్రిషా రెడ్డి (అమీన్పూర్, సంగారెడ్డి జిల్లా)
3. తుమ్మల స్నికిత (నీట్లో జాతీయస్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన విద్యార్థిని, మంచిరేవుల,రంగారెడ్డి జిల్లా)
4. దర్శి విష్ణు సాయి (ఎన్జిఒ కాలనీ నెల్లూరు,ఎపి)
5. మల్లిడి రిషిత్ (ఎన్టిఆర్ సర్కిల్, ఖమ్మం జిల్లా)
6. శ్రీ మల్లిక్ చిగురుపాటి(వివినగర్ కాలనీ, కూకట్పల్లి)
7. ఆవుల సుభాంగ్ (గచ్చిబౌలి,హైదరాబాద్ )
8. గారపాటి గుణ చైతన్య (కృష్ణా నగర్, కర్నూలు, ఎపి)
9. గిండేటి వినయ్ కుమార్ (చిత్తూరు,ఎపి)
10. కోట వెంకట్ (ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా,ఎపి)