Thursday, May 2, 2024

ఎంత తింటున్నామో.. అంత పండాలె

- Advertisement -
- Advertisement -

vegetables

రాష్ట్రంలో కొరత ఉన్న కూరగాయల సాగుపై నివేదిక
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సమర్పించిన ఉద్యాన శాఖ
ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఆకుకూరలు, పచ్చిమిర్చి, బీరకాయ, కాకరకాయ సాగు పెంపుపై ప్రణాళికలు, దిగుమతితో ఆరింటికే ఏటా రూ.600 కోట్లు,  రాష్ట్ర రైతుల లాభం చేకూరేలా.. వినియోగదారులకు నాణ్యంగా అందించాలని నిర్ణయం

హైదరాబాద్ : రాష్ట్రంలో కూరగాయల కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే అధికంగా వినియోగంలో ఉండి సాగులో కొరత ఉన్న కూరగాయలను ఇక్కడి రైతులతోనే పండించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా కూరగాయల పంటల సాగును కూడా పెంచాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం రాష్ట్ర అవసరాలు, ఉత్పత్తి వంటి వివరాలపై ఉద్యానశాఖ తాజాగా ఒక నివేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సమర్పించింది.

దీని ప్రకారం రాష్ట్రంలో ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీరకాయ, పచ్చిమిర్చి, సోరకాయ, కాకరకాయ,క్యాప్సికం, చామగడ్డ వంటి వాటి కొరత ఉంది. వీటి సాగును ఎంత మేర పెంచాలనే దానిపై కూడా ఉద్యాన శాఖ నివేదికలో తెలిపింది. దాదాపు రూ.600 కోట్ల విలువ మేర దిగుమతి చేసుకుంటున్న వీటిని రాష్ట్ర రైతుల చేత పండించడం ద్వారా లాభాలు రావడంతో పాటు వినియోగదారులకు తక్కవ ధరకే లభించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

రూ.148 కోట్ల ఉల్లి దిగుమతి

ప్రతి వంటలో ప్రధానమైన ఉల్లిగడ్డ రాష్ట్రంలో కేవలం 34 వేల ఎకరాల్లోనే సాగవుతోంది. ఎకరాకు 10 మెట్రిక్ టన్నుల దిగుబడితో 3.41 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. అయితే ఇది రాష్ట్రాల అవసరాలకు సరిపోకపోవడంతో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఉల్లిగడ్డను దిగుమతి చేసుకుంటున్నట్లు ఉద్యాన శాఖ నివేదికలో పేర్కొంది. దాదాపు రూ.148.50 కోట్ల ఉల్లి దిగుమతుల ద్వారానే వస్తోందని తెలిపింది.

రాష్ట్ర జనాభా 3.50 కోట్ల జనాభాకు రోజుకు 1205 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డ అవసరం. అదే ఏడాదికి ఈ మొత్తం 4.40 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుంది. అయితే రాష్ట్రంలో మాత్రం 3.41 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే వస్తోంది. దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల కొరత వేధిస్తోంది. దీంతో 14 వేల ఎకరాల్లో ఉల్లిసాగును చేపట్టడం ద్వారా ఈ కొరతను అధిగమించవచ్చునని నివేదికలో పేర్కొన్నారు.

16 వేల మెట్రిక్ టన్నుల లోటులో ఆకుకూరలు

ఆరోగ్యానికి ఎంతో ఉపకరించే ఆకు కూరలు కూడా రాష్ట్రానికి సరిపోను మన దగ్గర పండటం లేదు. రోజుకు 443.36 మెట్రిక్ టన్నుల చొప్పున ఏడాదికి 1.62 లక్షల మెట్రిక్ టన్నుల కొత్తిమీర, ఆకుకూరలు రాష్ట్రానికి అవసరం. దీని విలువ రూ.324 కోట్లుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం 1.46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సాగులో ఉంది. ఇంకా 16 వేల మెట్రిక్ టన్నల లోటు వేధిస్తోంది. దీంతో మరో 3916 ఎకరాల్లో ఆకు కూరల సాగును పెంచాల్సిన అవసరాన్ని నివేదికలో స్పష్టం చేశారు.

ఆలుగడ్డ మస్తుగా కావాలె

ఆలుగడ్డ కూడా అవసరాల మేర సాగు కావడం లేదు. దాదాపు 1.41 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు ఉద్యాన శాఖ నివేదికలో వివరించింది. రాష్ట్ర ప్రజలకు రోజుకు 491 మెట్రిక్ టన్నుల ఆలుగడ్డ అవసరం కాగా, ఏడాదికి 1.79 లక్షల టన్నులు అవసరం ఉంది. అయితే ఇప్పుడు 38 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి వస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 17,676 ఎకరాల్లో ఆలూ సాగును పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది.

రోజుకు 492 మెట్రిక్ టన్నులు పచ్చిమిర్చి

పచ్చిమిర్చి వినియోగం అధికంగా ఉన్న మన తెలంగాణలో 21 వేల మెట్రిక్ టన్నుల లోటు ఉంది. రోజుకు రాష్ట్ర ప్రజలు వివిధ అవసరాల మేరకు 492 మెట్రిక్ టన్నుల పచ్చిమిర్చి వినియోగిస్తుండగా, ఏడాదికి ఆ మొత్తం 1.79 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. దీంతో మరో 5324 ఎకరాల్లో పచ్చిమిర్చి సాగు పెంచనున్నారు. ఇక మిర్చి రకానికి చెందిన క్యాప్సికం సాగును ఒపెన్ ఏరియాలో మరో 717 ఎకరాల్లో సాగు చేసేందుకు అవకాశం ఉన్నట్లు ఉద్యాన శాఖ వెల్లడించింది. అలాగే పాలీహౌస్‌లో 144ఎకరాల్లో వేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న 5733 మెట్రిక్ టన్నుల కొరత తీరుతుందని తెలిపింది.

బీరకాయ.. కాకరకాయ అంతంతే

బీరకాయ,కాకరకాయ, సోరకాయలు కూడా అవసరాల మేర పండటం లేదు. వీటి సాగు పెంపునకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి ఏటా రూ.58 కోట్లు బీరకాయ, కాకరకాయ రూ.57.15 కోట్లు, సోరకాయ రూ.23.02 కోట్లు మేర దిగుమతి చేసుకుంటున్నట్లు నివేదికలో వివరించారు. ఈ మూడు కాయకూరలు మరో 13 వేల ఎకరాల్లో సాగు పెంచాలని ప్రతిపాదించారు.

Report on shortage of vegetable cultivation in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News