Tuesday, April 30, 2024

కేసీఆర్ త్వరగా కోలుకోవాలి.. ప్రజా సమస్యలపై మాట్లాడాలి: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించానని.. ఆయన కోలుకుంటున్నారని అన్నారు. వైద్యం కోసం అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరానని సీఎం రేవంత్ చెప్పారు. ప్రజాపాలనలో కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకుంటామని.. కేసీఆర్ ఆరోగ్యంపై మరింత జాగ్రత్త తీసుకోవాలని వైద్యులను ఆదేశించామని చెప్పారు.

ఆదివారం సోమాజీగూడ యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ కూడా వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా సోమాజీగూడ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో భేటీ అయ్యారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పడు పర్యవేక్షించేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి నిన్న(శనివారం) వైద్య, ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీని యశోద ఆస్పత్రికి పంపించారు.

కాగా, ఫాంహౌజ్ లో గురువారం అర్థరాత్రి బాత్ రూమ్ లో కేసీఆర్ కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు యశోద ఆస్పత్రి వైద్యుల బృందం హిప్ ప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News