Saturday, April 27, 2024

కీసర ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం

- Advertisement -
- Advertisement -
  • డిసిఎంను ఢీ కొట్టిన కంటైనర్
  • డ్రైవర్ మృతి, ఐదుగురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలు
  • డిసిఎంలో నుంచి మొక్కలు దించుతుండగా ప్రమాదం

కీసర: ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం వాహనాన్ని కంటైనర్ ఢీ కొట్టిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా ఐదుగురు మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. డీసీఎంలో నుండి మొక్కలు దించుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఔటర్ రింగ్ రోడ్డుపై నాటేందుకు శంషాబాద్ నుండి డీసీఎం (టిఎస్01 యుబి 3969) వాహనంలో మొక్కలు తెచ్చారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో కీసర ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 8 సమీపంలో డీసీఎం నుండి జవహర్‌నగర్ మల్కారంకు చెందిన కూలీ లు మొక్కలు దించుతున్నారు.

మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన డీసీఎం డ్రైవర్ సిరాజ్ అహ్మద్ సాబ్ షేక్ (40) కూలీలకు రక్షణగా నిలిచి అటు వైపుగా వస్తున్న వాహనాలకు దారి చూపుతున్నాడు. ఈ క్రమంలో ఘట్‌కేసర్ వైపు నుండి వేగంగా వచ్చిన కంటైనర్ (హెచ్‌ఆర్ 38 ఎసి 3852) సిరాజ్ అహ్మద్ సాబ్ షేక్ పైకి దూసుకువచ్చి డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మొక్కలు దించుతున్న కూలీలు పార్వతమ్మ (60), పల్లవి (42), సరస్వతి (16), జ్యోతి (18), ఈశ్వరి (17) తీవ్ర గాయపడ్డారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు గాయపడ్డ కూలీలను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు సిరాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News