హైదరాబాద్: భారీవర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్న ఘనత కేవలం మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు మాత్రమే దక్కుతుందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఆదుకోలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇటీవల కురిసిన భారీవర్షాలతో నగరంలో వరదనీటి ముంపునకు ఇండ్లుగురై నష్టపోయిన బాధిత కటుంబాలకు సీఎం ప్రకటించిన రూ. 10 వేల ఆర్దిక సహాయాన్ని ఆయన గురువారం పలు ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, అధికారులతో కలిసి అందచేశారు.
మందుగా ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోకి బిఎస్ మక్తాలో ఎమ్మెల్యే దానం నాగేందర్తో, అదే విధంగా కంటోన్మెంట్ నియోజక వర్గ పరిధిలోని గాంధీనగర్లో స్థానిక ఎమ్మెల్యే సాయన్నతో, గోషామహాల్ నియోజకవర్గ పరిధిలోని గన్ఫౌండ్రీ డివిజన్ల కార్పోరేటర్ మమతాగుప్తాలతో కలిసి బాధిత కటుంబాలకు రూ.10వేల ఆర్థిక సహయాన్ని అందచేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్దిక సాయం కోసం సీఎం ముందుగా రూ.550 కోట్లను విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంకా ప్రభుత్వసాయం అందని కుటుంబాలను గుర్తించి వారికి కూడా ఆర్దికసహయం అందచేయాలన్న సీఎం ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వివరించారు.