Tuesday, April 30, 2024

సింగరేణిలో రూ. 55 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కార్మికులకు ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి సంస్థ డైరెక్టర్
(ఫైనాన్స్ పర్సనల్ ) ఎన్. బలరామ్ ప్రత్యేక చొరవతో జరిగిన ఈ ఒప్పందంలో కార్మికులకు మేలు చేకూర్చే అనేక అంశాలు ఉన్నాయి. సింగరేణి వ్యాప్తంగా యూనియన్ బ్యాంకు లో ప్రస్తుతం ఖాతాలు కలిగి ఉన్న11,182 మంది సింగరేణి కార్మికుల ఖాతాలను ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా వెంటనే సూపర్ శాలరీ అకౌంట్లుగా మార్చాలని నిర్ణయించారు. తద్వారా ప్రతి కార్మికునికి ఉచితంగా 55 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయనున్నారు.

నెలకు కనీసం 25 వేల రూపాయల నుండి 75 వేల రూపాయల స్థూల జీతం పొందుతున్న ఉద్యోగులకు, అంతకు పైబడి వేతనం గల వారికి ఇది వర్తిస్తుంది. దీనిలో సూపర్ శాలరీ అకౌంటు ఉన్నందుకు 40 లక్షల ఇన్సూరెన్స్ పథకం, 5 లక్షల బ్యాంక్ ఇన్సూరెన్స్ తో పాటు ఏటీఎం రూపే కార్డు ఇన్సూరెన్స్ ద్వారా 10 లక్షల రూపాయలు మొత్తం కలిపి 55 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం కింద చెల్లిస్తారు. అదే విధంగా ఉద్యోగి 315 రూపాయల సాధారణ ప్రమాద ఇన్యూరెన్స్ స్కీమ్ కింద వార్షిక ప్రీమియమ్ చెల్లిస్తే ఆ పథకం కింద అదనంగా 30 లక్షల ప్రమాద బీమా సొమ్ము చెల్లించడం జరుగుతుంది.

ఈ విధంగా ఇటీవల మృతి చెందిన సింగరేణి కార్మికుల కు ఈ రెండు పథకాల కింద గరిష్టంగా 78 లక్షల రూపాలయలు చెల్లించడం జరిగింది . ఈ ప్రమాద బీమా సౌకర్యంతో పాటు మరో 22 రకాల అదనపు ప్రయోజనాలు కల్పించనున్నారు. ఏడాదికి మెడిక్లెయిమ్ ఆసుపత్రి ఖర్చుల కింద 15 వేల రూపాయలు చెల్లింపులు, ఉచిత చెక్ బుక్ సౌకర్యం, బ్యాంకు లాకర్స్ వినియోగంలో 25 నుండి 50 శాతం రాయితీ, రూ.25 లక్షలు అంతకన్నా పైబడి తీసుకునే రుణాలకు పూర్తి శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, రూ. 25 లక్షల కన్నా తక్కువ రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజులో సగం రాయితీ, గృహ నిర్మాణానికి సింగరేణి కార్మికులు తీసుకునే రుణంపై రాయితీ, వ్యక్తిగత రుణం, వాహన రుణం, విద్యా రుణాల పైన రాయితీలు, ఏటీఎం కార్డు వినియోగంలో రాయితీల వంటి అనేక ప్రయోజనాలు కలిగించే విధంగా ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పంద రాయితీలు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా 70 సంవత్సరాల వయస్సు వరకు అమలు చేయటానికి అంగీకరించారు. దీనివల్ల రిటైర్డ్ కార్మికులు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది.

కార్మికుల ప్రయోజనమే ప్రధానం : డైరెక్టర్ ( ఫైనాన్స్ అండ్ పా) ఎన్. బలరామ్
సింగరేణి సంస్థ తన కార్మికులకు, ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా ప్రతినెల దాదాపు 300 కోట్ల రూపాయల వేతనాలు చెల్లిస్తుందని, ఏడాదికి 30 వేల కోట్ల టర్నోవర్ ను బ్యాంకుల ద్వారా నిర్వహిస్తుందని డైరెక్టర్ ( ఫైనాన్స్ అండ్ పా) ఎన్. బలరామ్ తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా ఉద్యోగులకు మరిన్ని రాయితీలు కల్పించడం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందని, ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ఒప్పందం కుదిరిందన్నారు. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ తో జరిగిన ఒప్పందం కూడా ఎంతో మేలైనదని పేర్కొన్నారు. సింగరేణి ద్వారా కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకుల వారు కూడా తమ వద్ద ఖాతాలు గల సింగరేణి కార్మికులకు రాయితీలు కల్పించడానికి అంగీకరించారని ఇది ఒక శుభ పరిణామం అన్నారు. కార్మికులందరూ ఆరోగ్యంగా ప్రమాదాలకు గురికాకుండా జీవించాలని కోరుకుంటామని కానీ అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు వారి కుటుంబాలను కంపెనీ తరుపున ఆదుకోవడంతోపాటు బ్యాంకుల నుండి కూడా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తింపజేయడం వల్ల ఆ కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ఇటీవల శ్రీరాంపూర్ లో ఒక కార్మికుడు చనిపోగా అతని కుటుంబానికి 74 లక్షల రూపాయలను బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ పథకం కింద చెల్లించడం జరిగిందన్నారు. అలాగే గత ఏడాది కాలంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 8 మంది ఉద్యోగులకు కంపెనీ విజ్ఞప్తి మేరకు రూ.3.5 కోట్ల ప్రమాద బీమా పరిహారాన్ని యూనియన్ బ్యాంక్ అందజేసిందని తెలిపారు. సంస్థ ఛైర్మన్ ఆదేశం మేరకు కార్మిక సంక్షేమానికి వారి ప్రయోజనాలకి మరిన్ని మంచి పథకాలను అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ కారే భాస్కరరావు మాట్లాడుతూ ఆంధ్ర బ్యాంకు పేరుతో తాము గత 50 ఏళ్లుగా సింగరేణి ప్రాంతంలో సేవలందిస్తున్నామని, సింగరేణి ప్రాంతంలో చాలా శాఖలు ఉన్నాయని, గృహ రుణాలు, విద్యా రుణాలు ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ యూనియన్ బ్యాంకు నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. సింగరేణి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను సూపర్ శాలరీ అకౌంట్లుగా మార్చడం మరియు నిర్వహించడం కోసం హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ నుండి జనరల్ మేనేజర్ వెల్ఫేర్ , రిక్రూట్మెంట్ కె. బసవయ్య, ఎస్ ఓ టు డైరెక్టర్ పర్సనల్ ప్రకాశ్ రావు, పర్సనల్ మేనేజర్ ముకుంద సత్యనారాయణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జనరల్ మేనేజర్ పి. కృష్ణన్, రీజనల్ హెడ్ డి. అపర్ణ రెడ్డి, డీజీఎం గవర్నమెంట్ బిజినెస్ శ్రీ ఐ. రవి కృష్ణ, రీజినల్ హెడ్ అరుణ్ కుమార్, ఏజీఎం శ్రీ చంద్రా రెడ్డితదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News