Sunday, April 28, 2024

నూతన పంచాయతీరాజ్ చట్టంతో పల్లెల వికాసం

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మోర్తాడ్: నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులో తెలంగాణ పల్లెలన్నీ వికాసాన్ని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలో గ్రేడ్4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి శుక్రవారం మోర్తాడ్‌లోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో చేపట్టిన మార్పులతో తెలంగాణ పల్లెలు సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయని అన్నారు. గ్రామ పంచాయతీలను వికేంద్రీకరిస్తూ జవాబుదారీతనం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తూ తెచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామాలన్నీ వికాసాన్ని సంతరించుకొని యావత్ దేశంలో దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రతి పల్లెలో పచ్చదనం పెరిగి, ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరణ, కంపోస్టు షెడ్లు వంటి వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు.

కేంద్రం దేశ వ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, అందులో 19 అవార్డులు తెలంగాణకే వరించాయని వివరించారు. వీటిలో నిజామాబాద్ జిల్లాలో ఐదు గ్రామ పంచాయతీలు, బాల్కొండ నియోజక వర్గంలోని ఒక గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో ఉత్తమ జిపిగా ఒక గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో ఉత్తమ జిపిగా గుర్తింపు లభించడం జరిగిందన్నారు. ఈ విషయమై నీతి అయోగ్ వెల్లడించడం ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన దక్షతకు తార్కాణం అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పంచాయతీ కార్యదర్శుల కృషి పట్టుతలతోనే పల్లెల వికాసం సాధ్యపడిందని, ఈ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో తోడ్పాటును అందించారని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఎంపిపి శివలింగు శ్రీనివాస్, జెడ్పిటిసి రవి, డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, డిఎల్పీఓ శ్రీనివాస్, సర్పంచ్ భోగ ధరణి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ

మోర్తాడ్ మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News