హైదరాబాద్: మురుగునీటి నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జలమండలి ఎండీ.. దానకిషోర్ తెలిపారు. జలమండలి మురుగునీటి నిర్వహణ, కార్మికుల భద్రతపై నిర్వహిస్తున్న భద్రతా పక్షాత్సవాలలో భాగంగా బుధవారం అంబర్పేట ఎస్టీపీ ప్రాంగణంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా ఎండీ మాట్లాడుతూ కార్మికులు ఎట్టి పరిస్దితుల్లో ప్రమాదకరమైన పరిస్దితుల్లో పనిచేయకూడదనే ఈ అవగాహన కార్యక్రమాలను రూపకల్పన చేసినట్లు తెలిపారు.
ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, కార్మికుల భద్రత అంతకంటే ముఖ్యమని వివరించారు. పారిశుద్ధ్య పనుల్లో కార్మికులు తమ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం పారిశుద్ధ్య పనులు చేసే ముందు ప్రతి కార్మికుడు భద్రతా ప్రమాణాలను పాటిస్తామని, రక్షణ పరికరాలను తప్పనిసరిగా ఉపయోగిస్తామని, పారిశుద్ధ్య కార్మికుల కోసం రూపొందించిన ఈప్రతిజ్ఞను వారి చేత చేయించారు. అంతకు ముందు ఎస్టీపీ ప్రాంగణంలో మొక్కను నాటి నీరు పోశారు. ఈకార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్ ఆజ్మీరాకృష్ణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.శ్రీధర్బాబు ,టెక్నికల్ డైరెక్టర్ పి. రవికుమార్లతో పాటు పలువురు సీజీఎంలు, జీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.