Thursday, May 2, 2024

ఇసుక పాలసీ దేశంలోనే బెస్ట్

- Advertisement -
- Advertisement -

పారదర్శకత కోసం ఈ-వేలం
ప్రభుత్వానికి ఆదాయం పెంచే ప్రణాళికలు సిద్ధంగా చేయాలి
ఖాళీగా ఉన్న 127 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు
జిల్లాల వారీగా మినరల్ రెవెన్యూ పెంచాలి
ఎట్టి పరిస్థితిలో అక్రమాలను సహించేది లేదు
సమీక్షలో మంత్రి డాక్టర్ మహేందర్ రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్న ఇసుక పాలసీ దేశంలోనే బెస్ట్ అని, ఇతర రాష్ట్రాలు అనుసరించే విధంగా ఉన్నాయని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గనులు,భూగర్భ వనరుల శాఖ పై ఉన్నతాధికారులతో శుక్రవారం డా.బి.ఆర్. ఆంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గనుల శాఖ డైరెక్టర్ కాత్యాయని, టీఎస్‌ఎండీసీ ఎండీ మల్సూర్ ఉన్నతాధికారులతో గనులు, భూగర్భ శాఖ పనితీరు చర్చించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలులో ఉన్న మైనింగ్ , క్వారీ లీజులు, రెవెన్యూ వసూలు అంశాలతో పాటు ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం ఎంతవరకు నెరవేరిందని తెలుసుకున్నారు.

ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకువచ్చిన ఖనిజ బ్లాక్‌ల వేలంలో భాగంగా వేలం వేయడానికి పొందిన పర్యావరణ అనుమతులతో పాటు స్థాపన , ఆపరేషన్ కోసం పొందిన అనుమతులను గురించి వాకబు చేసి వీటిని వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 2014 ఆర్ధిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు శాఖ సాధించిన విజయాలు ప్రగతికి తోడ్పాటుగా ఉంటాయన్నారు. గనుల శాఖ దేశంలోనే అద్వితీయ ప్రగతి సాధించడం అభినందనీయమన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ. 2267 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించగా రూ.3884 కోట్లు ఇప్పటి వరకు సమకూరడం పై అభినందిస్తూ మరింత పటిష్టంగా పనిచేసి లక్ష్యాలను సాధించాలని చెప్పారు. గనులు, చిన్న తరహా మైనింగ్ లీజ్ లపై ఇంకనూ మంచి విధానం అమలవుతుందని అన్నారు.

రాష్ట్ర ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అవసరమైన ఇసుకను సరసమైన ధరలకు అందించాలని అధికారులకు సూచించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న 127 పోస్టుల భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిఎం కెసిఆర్ దృష్టికి తెస్తామని తెలిపారు. సాంకేతికతను అనుసంధానం చేసి గనులు,భూగర్భ వనరుల శాఖను మరింత బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని వివరించారు. గనుల నిర్వహణలో పారదర్శకత కోసం ఇసుకను ఆన్‌లైన్‌లో విధానం ద్వారా అమ్మేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయని వాటిని మరింత మెరుగైన విధంగా అమలు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలో అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు. టీఎస్‌ఎండిసి సంస్థ దేశంలో పలు అవార్డులను తెచ్చుకోవడం అభినందనీయమని కొనియాడారు.

రాష్ట్రంలో 101 రీచ్ ల ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నామని, 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని వెల్లడించారు. పట్టా భూముల్లో ఉన్న ఇసుక తదితరాల తవ్వకాలకు అనుమతులు వేగవంతం చేసేందుకు అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖలు వ్రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్నీ జిల్లాలలో ఇసుక కొరత లేకుండా లభ్యత ఉండాలని ఆదేశించారు. టీఎస్‌ఎండీసీ సాధ్యమైనంత ఎక్కువ ఇసుక రీచులు ఆపరేషన్ లో తేవాలని సూచించారు. ఇసుక రీచ్‌లు అందుబాటులో లేని జిల్లాలపై ఎక్కువ దృష్టిని పెట్టాలని తెలియజేశారు. ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని పెంచాలని తెలియజేశారు. సమీక్షలో ఆయా జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News