సుప్రీం కోర్టు జడ్జి చంద్రచూడ్కు కరోనా పాజిటివ్
ఒక్క రోజే 4205 మంది మృతి
24 గంటల్లో 3,48,421 కేసులు, 10 రాష్ట్రాల్లో కొత్తగా 73.17% మరణాలు
తగ్గుముఖం పట్టిన యాక్టివ్ కేసులు, కోలుకున్నవారు కోటి 93 లక్షల మంది
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయం కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా కొత్త కేసులు తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం పెరుగుతోంది. గడచిన 24 గంటల్లోదేశ వ్యాప్తంగా 3,48,421పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకే రోజు 4205 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40, 918 కి చేరింది. మరణాల సంఖ్య 2,54,197కు పెరిగింది. 10 రాష్ట్రాల్లో 73.17 శాతం తాజా మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 793 మంది మృతి చెందారు. తరువాత కర్ణాటకలో 480 మరణాలు సంభవించాయి. మంగళవారం నాడు 3,55,338 మంది కోలుకున్నారు. ఇక యాక్టివ్ కేసుల (క్రియాశీల కేసులు) సంఖ్య ప్రస్తుతం 37,04,099 వరకు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 11.122 కేసుల వరకు తగ్గాయి.
యాక్టివ్ కేసులు ఇలా తగ్గడం ఇది రెండోరోజుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది. మొత్తం కేసుల్లో 15.87 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే మొత్తం 1,93,82,642 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 17,52,35,991 వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. గత 24 గంటల్లో 18 నుంచి 44ఏళ్ల లోపు వయసు గల మొత్తం 4,79,282 మందికి వ్యాక్సిన్లు మొదటి డోసు అందాయి. ప్రపంచ దేశాల నుంచి సహాయంగా 9200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, 5243 ఆక్సిజన్ సిలిండర్లు,19 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, 5913 వెంటిలేటర్లు, /బై పిఎపి, 3.44 లక్షల రెమ్డెసివిర్ వయల్స్ అందగా, వాటిని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసినట్టు కేంద్రం వెల్లడించింది.
సుప్రీం కోర్టు జడ్జికి కరోనా పాజిటివ్
సుప్రీంకోర్టు జడ్జి డి.వై. చంద్రచూడ్కు కరోనా సోకింది. ఆయనతోపాటు ఆయన సిబ్బందిలో ఒకరికి కూడా కరోనా సోకింది. జస్టిస్ చంద్రచూడ్ కరోనా నుంచి కోలుకుంటున్నారని కోర్టు వర్గాలు తెలిపాయి. అయితే ఆయన నేతృత్వం లోని ధర్మాసనం కొన్ని రోజుల పాటు సమావేశం కాకపోవచ్చని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా దేశంలో కరోనా సంక్షోభానికి సంబంధించిన అంశాలను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం లోని సుప్రీం కోర్టు ధర్మాసనం విచారిస్తుంది. ఈమేరకు వచ్చిన పిటిషన్లను గురువారం విచారించ వలసి ఉంది. కానీ చంద్రచూడ్ అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వడవచ్చు.