ముందుకొచ్చిన గ్రాన్యూల్స్ ఇండియా
రూ.8 కోట్లు విలువైన పారాసిటమాల్ విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం చేయడానికి ముందుకొచ్చింది. 16 కోట్ల పారాసిటమాల్ 500 ఎంజి మాత్రలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం బిఆర్కెఆర్ భవన్లో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ను గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా దేవి చిరుగుపాటి బుధవారం కలిసి ఒక వారరానికి సంబంధించిన విరాళాన్ని అందజేశారు. రెస్పాన్సిబుల్ కార్పోరేట్ కంపెనీగా తమ కంపెనీ తరపున రూ.8 కోట్ల విలువైన పారాసెటమాల్ మాత్రలు విరాళంగా ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. బుధవారం నుంచి వారానికి కోటి మాత్రల చొప్పున వచ్చే నాలుగు నెలల్లో మొత్తంగా 16 కోట్ల పారాసెటమాల్ మాత్రలు ఉచితంగా ఇవ్వనున్నట్లు గ్రాన్యూల్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.