సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో పవన్కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ప్లే- సంభాషణలను సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ఈ చిత్రం షూటింగ్ విరామంలో పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించింది చిత్రం యూనిట్. వీటిని షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ అంటూ మీడియాకు విడుదలచేశారు. ‘యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు. యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు. నాయకుడు ఈ రెండింటినీ తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు’ అంటూ ఈ వీడియో చివరలో వాక్యాలు కనిపించాయి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్. ఈ చిత్రంలోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నామని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి. 2022 జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.