Friday, May 3, 2024

మా‘నవ’వాదానికి వెన్నెముక-సైన్స్!

- Advertisement -
- Advertisement -

Science is the backbone of our modernism

నువ్వో మతంలో పుట్టావు. నేనో మతంలో పుట్టాను. నీకో దేవుడున్నాడని నీకు నీ వాళ్లు చెప్పారు. నాకో దేవుడున్నాడని నాకు నా వాళ్లు చెప్పారు. నీకు నువ్వు పుట్టిన ఊరు, దేశం వున్నాయి. నాకు నేను పుట్టిన ఊరు, దేశం వున్నాయి. నీకు నీ భాషా సంస్కృతులున్నాయి. నాకు నా భాషా సంస్కృతులున్నాయి. కాని, మతాలతోను, దేశాలతోను, భాషలతోను, కులాలతోను, గోత్రాలతోను, జాతులతోను, జాతీయతలతోను సంబంధం లేనిది, ప్రపంచ పౌరులందరికీ కావాల్సింది ఒకటుంది అదే మానవత్వం!

దానికి మళ్లీ వెన్నుపూసలా ఇప్పటి దాకా నిలబడింది. ఇక ముందు కూడా నిలబడుతూ వుండేది ఇంకా ఒకటుంది అదే సైన్స్ ప్రపంచ పౌరులందరి ఉమ్మడి ఆస్తి! అది ఒక దేశానిదో, ఒక మతానిదో, ఒక జాతిదో కాదు. ప్రాంతీయ దురభిమానాలకు, భాషా విద్వేషాలకు అతీతమైంది. ధనిక పేద భేదాలు, అగ్ర నిమ్న తేడాలు లేనిది ప్రపంచ పౌరుల సమిష్టి కృషికి దక్కిన, దక్కుతున్న ఫలితం సైన్స్! సమాజంలో నిమ్నోన్నతాలు తొలగించి, ఒక సమతుల్యం సాధించడానికి ఉపయోగించాల్సిన శాస్త్రం అదే శాస్త్రం : విజ్ఞాన శాస్త్రం! ఎవరెన్ని వాదనలు చేసినా అంతిమంగా ఒకటి మాత్రమే నిజం సైన్స్ ఆధునిక మానవుడి జ్ఞాన నేత్రం!! మారుతున్న జీవన శైలికి దర్పణం స్వశక్తి లోంచి వెల్లివిరుస్తున్న మానవత్వపు విజయం
ఏ వైజ్ఞానికుడు, ఏ సాంకేతిక నిపుణుడు ఏయే ఆవిష్కరణలు చేసినా అవి సర్వ ప్రపంచ మానవాళి కోసం చేస్తున్నాడు. కేవలం తన కోసమో, తన వారి కోసమో లేక తన దేశం కోసం మాత్రమో కాదు.

అంటే ఆ ఆలోచనలోనే మానవ సేవ వుంది. మానవత్వం వుంది. మానవతా దృక్పథానికి సైన్స్ ఎప్పుడూ వెన్నెముకగా నిలబడుతూ వస్తోంది. సైన్స్ అవసరం లేని మానవత్వం. మానవత్వం అవసరం లేని సైన్స్ ఊహించలేం. అయితే సైన్స్ ఆవిష్కరణలను మనిషి కుటిల బుద్ధి వినాశనానికి వాడుకున్న ఉదంతాలు లేకపోలేదు. మళ్లీ అది, వేరే విధంగా చర్చించాల్సిన విషయం. అయితే సమాజాన్ని గతి తప్పించడం, నాశనం చేయడం సైన్స్ ఎప్పుడూ తన ధ్యేయం చేసుకోలేదు. నిర్మాణం మీద, పునర్నిర్మాణం మీదే సైన్స్ ఎప్పుడూ దృష్టి పెడుతూ వస్తోంది. కొందరు పెద్దలు మానవత్వం, మానవతా వాదం గురించి విరివిగా మాట్లాడుతుంటారు. కాని, దానికి విరుద్ధమైన పనులు చేస్తుంటారు. దీని వల్ల అమాయకులైన సామాన్యులు అయోమయంలో పడుతుంటారు.

అందుకే మానవత్వమంటే ఏమిటో, అది ఎలా వాడుకలోకి వచ్చిందో టూకీగా తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీషులో ‘హూమనిజం’ అంటున్నాం. ఇంగిత జ్ఞానంతో మొదలై, నైతిక విలువలతో కూడిన ఒక తాత్విక చింతన మానవత్వం! దానికి కొంత విచక్షణ, విశ్లేషణా జ్ఞానం తోడైతే అదే హేతువాదమవుతుంది.అది పూర్తిగా ప్రజాస్వామ్యపు పునాదుల మీద నిలబడి, మానవ జాతిలో సమానత్వం కోసం సంఘర్షిస్తుంది. అన్ని దశల్లో అన్ని వేళలా మానవాభ్యుదయాన్ని కాంక్షించేదే మానవతా వాదం. ఫెడ్రిచ్ ఇమ్మాన్యుల్ నైథమ్మర్ (FRIEDRICH NIETHAMMER) తొలిసారి 1808లో ఈ ‘హ్యూమనిజం’ అనే పదాన్ని రూపొందించాడు. నిజానికి ఇది లాటిన్ భాషలోని హ్యుమనిటస్ (HUMANITAS) అనే పదంలోంచి తీసుకున్నది.

ఇలాంటి పదాలు ఇంగ్లీషులో ఇజంతో (ISM) ముగుస్తాయి గనుక, దీనికి ఇజం కలిసి ‘హ్యూమనిజం’ అయ్యింది. దీనిలోంచే ‘హ్యుమానిటి’ అనే పదం వచ్చింది. బవేరియన్ ఎడ్యుకేషనల్ కమిషనర్ అయిన ఫెడ్రిచ్ నైథమ్మర్ తన అధికారాల్ని ఉపయోగించి జర్మన్ సెకండరీ స్కూళ్లలో ‘హ్యుమనిటస్’ను ఒక పాఠ్యాంశంగా చేర్చి, బోధించే ఏర్పాటు చేశాడు. ఆ విధంగా 1936 లో ‘హ్యూమనిజం’ అనే పదం ఇంగ్లీషు భాషలో చేర్చబడింది. 1765లోనే ఒక పేరు తెలియని రచయిత ‘మానవాళిని ప్రేమిద్దాం!’ అని రాశాడని ఆ తరువాత పరిశోధనల్లో బయటపడింది. ఏది ఏమైనా, ఫ్రెంచ్ విప్లవానికి ముందు వెనకలుగా వెలువడ్డ చరిత్ర, తాత్విక చింతన, సామాజిక, రాజకీయ సాహిత్య గ్రంథాలు మానవాళిని కేంద్రకంగా చేసుకుని వెలువడ్డాయి.

అలుస్ జిల్లియస్ (AULUA GELLIUS) క్రీ.శ. 125 180 నాటి భాషా శాస్త్రజ్ఞుడు హ్యూమనిటస్‌కు దాదాపు సరిసమానమైన పదం గ్రీకులో ఫిలాంత్రఫీ (PHILANT HROPY) అవుతుంది గనుక, దాని లక్షణాలు కూడా కలిపి ఆ రెండింటి అర్థాల్ని స్వీకరించాలన్నాడు. లోకోపకారిగా తన తోటి వారిపై దయాగుణం ఉండడం, అవసరమైనప్పుడు వారికి తగిన రీతిలో సేవ చేయడం లాంటివన్నీ సమాజానికి అలవాటు చేయాలన్నాడు. ఈ ఆలోచనను, ఈ పదాల్ని వాటికున్న అర్థాల్ని, వాటి చుట్టూ అల్లుకున్న విస్తృత అర్థాల్ని రోమన్ తత్వవేత్త కవి సిసిరో (10643 బిసిఇ) జనంలో ప్రచారం చేశాడు. దయాగుణం, సేవాభావమే కాదు, తగిన విద్వత్తు కూడా వుంటేనే అతణ్ణి ‘హ్యుమనిటస్’గా గుర్తించాలన్నాడు.. సిసిరో ఆ విధంగా చాలా శతాబ్దాలు మత విశ్వాసాలతో పాటు ‘మానవత్వం’ చలామణి అయ్యింది.

క్రమక్రమంగా 18, 19 శతాబ్దాల కాలంలో మానవ అవసరాల మీద శ్రద్ధ పెట్టడం, పనికిరాని విశ్వాసాల్ని పక్కకు నెట్టడం, ప్రతి దానికీ కారణాల్ని అన్వేషించడంతో ప్రారంభమై ‘మానవతా వాదం’ ఒక ఆలోచనా ధోరణిగా రూపుదిద్దుకోవడం మొదలయ్యింది. ఆ ఆలోచనా ధోరణి అన్ని కళల్లోకి వ్యాపించింది. మానవవాద దృక్పథంలోంచి లలితకళలు, కవిత్వం, విద్య, వైద్యం వంటి రంగాలన్నీ బలపడుతూ వచ్చాయి. ప్రతిచోట, ప్రతి రంగంలో ప్రశ్నకు విలువ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించుకునే క్రమంలో హేతువాదంతో కూడి న మానవతావాదం, శాస్త్రీయ అవగాహన వ్యాప్తి చెందాయి.

తొలిసారిగా 1933లో ‘హ్యూమనిస్ట్ మానిఫెస్టో’ చికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో విడుదల అయ్యింది. ఆ మానిఫెస్టో ప్రధానంగా కారణం, నైతికత, సామాజిక ఆర్థిక న్యాయం, సమన్వయం అనే సూత్రాల మీద ఆధారపడింది. వీటన్నిటితో పాటు మరొక విషయం ప్రత్యేకంగా చర్చించబడింది. అదేమిటంటే, ఆధారం లేని విశ్వాసాలు, మూఢ నమ్మకాలు పక్కకునెట్టి, వైజ్ఞానిక అవగాహనను పెంపొందించాలని, దానిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వుందని కూడా మానిఫెస్టోలో రాశారు. మానవతావాదం గురించి అవగాహన పెరుగుతున్న దశలో ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు నిఘంటువు ఒక వ్యతిరేకమైన అర్థాన్ని ప్రచురించింది. దాన్ని రూపొందించిన బృందంలో ఒక ఇంగ్లీషువాడు, హ్యుమనిస్ట్‌లంటే చులకన భావం గలవాడు ఆ అర్థాలు రాశాడు. “దైవ భావనను ధిక్కరించే వారు”, “ఉట్టి మానవతావాదులు”, “అరాచక వాదులు”, “ఆస్తులను దోపిడీ చేయువాడు” అని రాశాడు.

బహుశా అతను విశాలమైన భావజాలంతో ప్రగతిశీల ధోరణితో ఆలోచించలేనివాడై వుంటాడు. అందువల్ల అతను తన అక్కసును అలా వెళ్లగక్కుకున్నాడు. అది మాత్రమే కాదు, అలాంటి మరి కొన్ని సంఘటనలు జరుగుతూ రావడం వల్ల సహజంగా మతతత్వవాదులకు వెయ్యేనుగుల బలం చేకూరింది. అదే సమాజంలో వేళ్లూనుకుని పోయింది. తరతరాలు ప్రపంచ వ్యాప్తంగా దైవ భావన బలం పుంజుకుంది. దాని పర్యవసానంగానే మతాన్ని, దైవాన్ని ప్రశ్నించిన వారు దుర్మార్గులు, పాపాత్ములు, చెడ్డవారు అనే ముద్ర వేయబడుతూ వచ్చారు. అందుకే చూడండి.. పరిస్థితి ఈ నాటికీ పూర్తిగా మారలేదు. మత విశ్వాసాలలో పడి కొట్టుకుపోయే వారిని మామూలు మనుషులుగా పరిగణిస్తున్నాం.

స్వేచ్ఛాలోచనతో హేతుబద్ధంగా మాట్లాడే వాళ్లను పిచ్చివాళ్ల కింద జమ కడుతున్నాం. అయితే అడ్డుకునే వారూ, విషయం వివరించే వారూ ప్రతి తరంలో ఎవరూ వుండడం లేదని కాదు, వుంటున్నారు. కాని ఏ కొద్ది మందో వుంటున్నారు. విశాల హృదయంతో ఆలోచించలేని వారిని దైవ భావనలో పడి కొట్టుకుపోతున్న వారిని, ఈ దేవుడు కాదు ఆ దేవుడని, ఈ మతం కాదు ఆ మతమని కొట్టుకు చచ్చేవారిని సమాజంలో అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు మహానుభావులు హెచ్చరిస్తూనే వచ్చారు. వాస్తవంలోంచి ఆలోచించండని, కారణాల్ని వెతకండని బోధిస్తూనే వచ్చారు. అలాంటి వారిలో ఎర్నెస్ట్ రెవన్ (ERNEST RENAN) పేరు తప్పక చెప్పుకోవాలి. ‘జ్ఞానం యొక్క భవిత: 1848 నాటి ఆలోచనలు’ అనే గ్రంథం లో ఆయన ఇలా రాశాడు. “భవిష్యత్తులో మతమేదైనా ఉంటే, అది మా‘నవ’వాదమే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. శాఖోపశాఖలుగా వున్న ఈ విశ్వాసాలన్నీ ఒక్క తాటిపై కొచ్చి నైతిక విలువలతో కూడిన ‘మా‘నవ’వాదం’గా రూపుదిద్దుకుంటుంది తప్పుదు!”

మరి ఇంత మంది ఇన్ని చెపుతున్నా ‘ఈ ప్రపంచం ఇలా ఎందుకుంది’? అన్న ప్రశ్నకు కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే సమాధానం దొరుకుతుంది. మనుషులు ప్రేమించడానికి, ప్రేమించబడడానికి పుడుతున్నారు. వస్తువులు (ఆస్తి) ఉపయోగించుకోవడానికి ఉత్పత్తవుతున్నాయి. కాని, ఇప్పుడు జరుగుతున్న విచిత్రం గమనించండి. మనుషుల్ని ఉపయోగించుకున్నాం. వస్తువుల్ని (ఆస్తిని) ప్రేమిస్తున్నాం. ఇలా అసహజంగా ప్రవర్తిస్తున్నందువల్లే లోకం రీతి మారింది. మానవ ప్రవృత్తి ఎంత విచిత్రమైందంటే.. వాడు స్వర్గంలోని ఉద్యానవనాల్ని కలగంటాడు. తన ఇంటి కిటికీ బయట పూసిన రోజా పువ్వును చూసి ఆనందించలేడు. స్వర్గంలో వున్నారనుకునే రంభ, ఊర్వశి, తిలోత్తమల కోసం అర్రులు చాస్తాడు. చుట్టూ వున్న అందమైన మనుషుల్ని చూసి సంతోషించలేడు. కనబడని దేవుడి గొప్ప మనసు గూర్చి నోరు నొప్పి పెట్టేట్టు పొగడుతుంటాడు. తనకు సహాయపడ్డ పక్కవాడి గొప్ప మనసు పట్ల కృతజ్ఞతభావం ప్రకటించలేడు. అందువల్ల ఇప్పుడు బుద్ధీ, జ్ఞానం వున్న ప్రతివాడూ తక్షణం తనేం చేయాలో తనే నిర్ణయించుకోవాలి.
దుర్మార్గాల్ని ఆపే శక్తి సంప్రదాయాలకు లేదు
వైజ్ఞానిక అవగాహన పెరిగితేనే మానత్వం వికసిస్తుంది.

డా. దేవరాజు
మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News