Tuesday, April 23, 2024

‘నేను’ అంటే: ఒక వైజ్ఞానిక వివరణ

- Advertisement -
- Advertisement -

ఏళ్ళకేళ్ళుగా జీవాత్మ పరమాత్మ అంటూనో, అహం బ్రహ్మస్మి అంటూనో ఆధ్యాత్మిక, ధార్మిక తాత్వి క ప్రముఖులు ఇచ్చే వివరాలు వింటూ కాలం గడిపేశాం. మానవుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి అవి కొన్ని శతాబ్దాల పాటు ఉపయోగపడ్డాయి. నిజమే! కాని, అవి నిజ నిర్ధారణకు నిలబడేవి కావు. కేవలం నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా మానవ సమాజాన్ని ప్రభావితం చేశాయి. నేల కొరుగుతున్న తీగను నిలబెట్టడానికి పందిరి వేయాల్సి వుంటుంది. విశ్వాసాలు పందిరి లాంటివి. ఇప్పుడు మనకు ఉన్న విజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం తీగ దశలో లేదు. మహావృక్షంగా మారిపోయింది. దాన్ని నిలబెట్టడానికి ఏ పందిరి గుంజా అక్కర లేదు. దాన్ని అలా స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఏపుగా ఎదగనివ్వాలి. వర్ధిల్లనివ్వాలి. విశ్వాసాల నీడలో, అభద్రతా భావంతో ఇంకా ఇంకా బితుకు బితుకు మంటూ బతకగూడదు. వాస్తవాల్ని అర్థం చేసుకొని, ఆత్మవిశ్వాసంతో మనగలగాలి.

“నువ్వు నీచుడివి, నికృష్టుడివి, జన్మరాహిత్యం కోసం ఫలానా దేవుణ్ణి నమ్ము, ఫలానా మతంలో చేరు” అని చెపుతాడు ఏ మత పెద్దయినా. అదంతా వారు వారి వారి మనుగడ కోసం పడుతున్న తాపత్రయం అని మనం అర్థం చేసుకోవాలి!
“మీరు నమ్మండి. ఫలితం కనిపిస్తుంది” అని అంటారు వాళ్ళు. “ఫలితం కనిపిస్తే నమ్ముతాం” అని అందాం మనం.
చీమగా, దోమగా, కుక్కగా, గాడిదగా పుట్టి పుట్టి పుణ్యం చేసుకున్నందు వల్ల మనిషి మనిషిగా పుట్టాడని చెపుతారువాళ్ళు. అంటే సృష్టిలో మనిషి ఉన్నఫళాన ఊడిపడలేదనీ, కాలక్రమంగా పరిణామ దశల్లో జంతు రూపాల దశలు దాటి, దాటి చివరికి మనిషి మనిషి రూపు సంతరించుకున్నాడని చెప్పే ప్రయత్నమే అది కాబోలని.. మనం అనుకోవచ్చు! అయితే ఆ అభిప్రాయం జనంలో అసమగ్రంగా, అమాయకంగా, అజ్ఞానంగా ఇంకిపోవడం వల్ల, రూపాంతరం చెందడం వల్ల అది చాదస్తంగానూ, మతమౌఢ్యంగానూ మిగిలిపోయింది.

మానవ జన్మ ఉత్కృష్టమైంది. నిజమే! జీవ పరిణామక్రమంలో ‘జీవి’ మారుతూ, మారుతూ ఒక ఉచ్ఛ స్థితికి చేరుకొంది అదే మానవుడు! అందువల్ల మానవుడే జీవరాసులన్నింటిలోకి తెలివైన వాడు. అలాగే ప్రకృతిలో అత్యంత విలువైన ప్రాణి మానవుడే! ఎందుకంటే మనిషి తన చుట్టూ వున్న ప్రకృతిని అర్థం చేసుకున్నాడు. ప్రకృతిలోని వృక్ష, జంతు సముదాయాన్ని అర్థం చేసుకున్నాడు. కొన్నిటిని పెంచుకున్నాడు. కొన్నిటిని మచ్చిక చేసుకున్నాడు. తన జీవితం సుఖమయం కావడానికి కావల్సిన అన్ని వస్తువుల్ని వాటి నుంచి సంగ్రహించాడు. అలాగే తనని తాను తెలుసుకొనే ప్రయత్నం చేశాడు. ఇంకా చేస్తూనే వున్నాడు. ఈ భూమండలం మీద మరో జీవి ఇలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.

‘నేనంటే ఎవరు?’ అనే ప్రశ్న మనిషి మెదడులో అనాదిగా వుంటూనే వుంది. ప్రగతి పథంలో ముందుకు వస్తున్న కొద్దీ ఆ ప్రశ్నకు నిర్వచనం మారుతూ వుంది. ఒకప్పటి అనాగరికుల, ఆటవికుల నిర్వచనానికీ, నాగరికుల నిర్వచనానికి తేడా వుంది. కళ్ళు, ముక్కూ మూసుకొని ఆత్మల లోకంలో విహరించే రుషులిచ్చిన నిర్వచనానికి, ఆధునికుడిచ్చే నిర్వచనానికి తేడా వుంది. ఈ 21వ శతాబ్దపు అత్యాధునికుడికి అవేవీ సంతృప్తి నివ్వవు. అసమంజసంగా, అసమగ్రంగా కూడా అనిపిస్తాయి. అయితే ఇక్కడ కొంత మంది అత్యాధునికులు అతి పురాతన నిర్వచనాల్ని నెత్తిన పెట్టుకొని మోస్తుంటారు. ఈ కాలానికి అనుగుణంగా ఈ కాలపు పరిజ్ఞానంతో ఇప్పటి వైజ్ఞానికులిచ్చే నిర్వచనాన్ని వాళ్ళు పట్టించుకోరు.

అన్ని ఆధునిక వసతులు ఉపయోగించుకుంటూ, ఎప్పుడో వేల ఏళ్ళ నాటి మనిషి ఏర్పరుచుకొన్న అభిప్రాయాల్ని, నిర్వచనాల్ని సంస్కృతి, సంప్రదాయాల పేరుతో నిలబెట్టాలని చూస్తుంటారు. అత్యధిక సంఖ్యలో ఉన్న అలాంటి ‘వెనక చూపు’ మనుషులకు ‘ముందు చూపు’ నేర్పించే ప్రయత్నమే ఈ ‘నేనంటే ఎవరు?’ అనే పుస్తకం! వాస్తవాల్ని జీర్ణించుకోలేని వారు ఈ పుస్తకం చదవకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ ‘నేనంటే ఎవరు?’ అనే పుస్తకం ఈ విశాల విశ్వంలో మనిషి అనే వాడు ఎవరో అర్థం చేయించే ప్రయత్నం చేస్తుంది. ఏమో.. భవిష్యత్తులో ఈ సమాచారం పాతదై పోవచ్చు. అందుకు కూడా మనం సిద్ధపడే వుండాల్సి వుంటుంది!

మనలో దాగి వున్న ‘నేను’ అనే భావం అంటే ‘అహం’ ఏమిటీ? అది ఎలా వుంటుంది? అది మనలో దాగి ఉన్న మరొకరా? లేక మనమేనా? ఈ విషయం మనిషిని చాలా కాలంగా కలవరపెడుతోంది. మనిషి నిరంతరం దాని కోసం అన్వేషిస్తూనే వున్నాడు. అయితే ఇప్పటి వరకు మనిషి తనను తాను ఎంత వరకు అన్వేషించుకున్నాడు? సమాధానాలు ఎంత వరకు సంపాదించుకోగలిగాడు? ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాల్సిన అంశం. జీవశాస్త్రపరంగా ఈ ‘నేను’ అనే దానికి సమాధానం వెతుక్కోవాలి. కొత్త నిర్వచనానికి రూపకల్పన చేయాలి. అలాగే ఇన్ని దేశాలలో, ఇన్ని జాతులలో, ఇన్ని వర్ణాలతో వున్న మానవ సమాజం లోంచి ఈ ‘నేను’ ఎలా ఉద్భవించాడు? అలాగే నేను తినేదాన్ని బట్టి నా జీవన ప్రక్రియలుంటాయి. ఈ జీవన ప్రక్రియల్ని బట్టి నా ప్రవర్తిన, మనస్తత్వం రూపొందుతుంది.

వాటి అనుగుణంగానే, ఈ సమాజం ఈ ‘నేను’ కు ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైన కోణాల నుండి ‘నేను’ ను విశ్లేషించే ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది. సరదాగా కుటుంబంలో జరిగే సంభాషణల ద్వారా విషయం సీరియస్‌గా చర్చించడం వుంది. ‘ఆత్మ పరమాత్మలో కలవాలి’ అనే ఆధ్యాత్మిక గురువులు చెప్పే శుష్క ప్రవచనాల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి మనిషికి, అతని ఆత్మ విశ్వాసానికి అంతర్ చైతన్యానికి ఇక ప్రాధాన్యమివ్వక తప్పదని ఈ రచన స్పష్టం చేస్తుంది. ఏక కణ జీవి నుండి మానవుడి దాకా ఉన్న సుదీర్ఘ జీవ పరిణామక్రమంలో ఎన్నో సంక్లిష్టతల్ని సంతరించుకుంటూ, నిరంతరం సంఘర్షిస్తూ, తన అస్థిత్వాన్ని కాపాడుకుంటూ, మనిషి అంటే ఈ నేను అనేవాడు ఉద్భవించాడు. వీడు అటు ఊహించుకున్న దేవుడు కానక్కర లేదు. ఇటు కల్పించుకున్న దయ్యామూ కానక్కర లేదు.

మనిషి మనిషిగా హుందాగా ఈ సృష్టిలో తను అత్యంత విలువైన ప్రాణినని, విలువల్ని నిలబెట్ట గలిగే ప్రాణినని.. తనను తాను నిలబెట్టుకో గల సర్వసామర్థాలు గలవాడినని.. అచంచలమైన ఆత్మ విశ్వాసంతో మనుగడ సాగించాల్సి వుంది. ఇంకా చంకల కింద విశ్వాసాల కర్రలు దోపుకొని అవిటివాడివలే బతకాల్సిన పని లేదు. సుఖాన్ని సుఖంగానూ, దుఃఖాన్ని దుఃఖం గాను, మరణాన్ని మరణంగానూ స్వీకరించగలిగే చేవ గల సర్వ స్వతంత్రుడు కావాలి. తన జీవితాన్ని తాను నియంత్రించుకో గల మేధావి, దార్శనికుడు, క్రాంతికారుడు మనిషి! తనను తాను తెలుసుకోవడమేంటే ఆధ్యాత్మిక పరంగా పలాయనం చిత్తగించడం కాదు. జీవశాస్త్ర పరంగా, సామాజిక పరంగా, ఆర్థికపరంగా, ఆహారపరంగా, విహార పరంగా, పర్యావరణ పరంగా వాస్తవాల్ని వాస్తవాలుగా తెలుసుకోవడం మాత్రమే! ఆ ప్రయత్నంలో కొందరు అడుగులు ముందుకు వేశారు. ఇక మనందరం వారిని అనుసరించాల్సి వుంది. సెప్టెంబర్ 2018లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ వారు ప్రచురించిన “నేను” అంటే ఎవరు? ఒక వైజ్ఞానిక వివరణ’ అనే పుస్తకానికి సంబంధించిన పరిచయం ఇది.

30 డిసెంబర్ 2021 గురువారం ఉదయం ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి వారు బాల సాహిత్య పురస్కారం ప్రకటింపబడిందని టివి వార్తల్లో తెలుసుకున్న నా మిత్రులు, తోటి రచయితలు, ప్రముఖులు, శ్రేయోభిలాషులు, సామాన్యులు ఎంతో సంతోషించారో వారి మాటల్లో పొంగిపొర్లిన ఉల్లాసం తెలియజేప్పింది. వారందరికీ సోషల్ మీడియా ద్వారా నా ధన్యవాదాలు తెలియజేశాను. పత్రికా ముఖంగానన్నభినందించిన ఆంధ్రప్రదేశ్, హర్యానా, గవర్నర్‌లకు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, తెలంగాణ ఐటి శాఖ మంత్రికి పత్రికా ముఖంగానే నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాహిత్య అకాడెమి కమిటీ సభ్యులు కొన్ని పరిమితులకు లోబడి అలాంటి నిర్ణయం తీసుకొని వుంటారని దాన్ని హుందాగా స్వీకరించాలని.. కొందరు పెద్దలు, సన్నిహిత సాహితీ ప్రముఖులు సూచన చేశారు.

అయినా, వ్యవస్థల్ని, ప్రభుత్వాల్ని నిష్కర్షగా దుయ్యబడుతూ అన్ని ప్రక్రియల్లో నేను చేస్తూ వస్తున్న కృషి ఎంతో వుంది గనుకనే, ఇక ఏదో రకంగా అకాడెమీకి నన్ను గుర్తించక తప్పలేదనీ కొందరు విశ్లేషణ చేశారు. అయినా ప్రవాహానికి ఎదురీదుతూ, సంఘర్షిస్తూ సాధించిన విజయమని, దీన్ని తక్కువగా తీసుకోగూడదని, ఏదైతేనేం జాతీయ స్థాయి గుర్తింపు కదా అని కొందరు ప్రోత్సహించారు. “బాల సాహిత్యంలో ఇడమని పుస్తకాన్ని ఈ కేటగిరిలో ఎందుకు చేర్చారో నాకు తెలియదని” నేను చెప్పిన విషయం ప్రముఖ దిన పత్రికలు ప్రముఖంగానే ప్రచురించాయి. ఇంటర్వూ చేయడానికి వచ్చిన టెలివిజన్ ఛానళ్ళ ముందు నేనొక ముఖ్యమైన విషయం ప్రస్తావించాను. సాహిత్య అకాడెమి సాహితీ ప్రక్రియలకు అవార్డులిస్తోంది. అనువాదాలకిస్తోంది. యువ పురస్కారమిస్తుంది. కాని, స్వాతంత్య్రం లభించిన ఇన్నేళ్ళ తర్వాత కూడా వైజ్ఞానిక విషయాల మీద వచ్చే పుస్తకాలకు (వైజ్ఞానిక సారస్వతానికి) ప్రత్యేకంగా ఓ అవార్డు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదో.. ఆలోచించుకోవాలని చెప్పాను.

అకాడెమీలన్నీ ప్రారంభించింది భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. దేశంలోని దాదాపు అన్ని వైజ్ఞానిక పరిశోధనాశాలల్ని ప్రారంభించింది ఆయనే. ఈ దేశ ప్రజలు అంధ విశ్వాసాల్లోంచి బయటపడి వైజ్ఞానికంగా ముందడుగు వేయాలని కలలుగన్న వాడాయన! ప్రధానిగా ఉన్న కాలంలో ఆ దిశలో నిర్విరామంగా కృషి చేసిన వారు. మరి ఆయన స్ఫూర్తిని సాహిత్య అకాడెమి నిలుపుకోవాలి కదా? ఇప్పటి వరకు ఆలోచన రాకపోతే, ఇక ఇప్పుడైనా రావాలి. సృజనాత్మక రచనలు గొప్పవే. కాని సమాజానికి నేరుగా ఉపయోగపడే వైజ్ఞానిక స్పృహను పెంచే రచనలు ఇంకా గొప్పవి! ఈ అవార్డుల వల్ల నాకు అదనంగా వచ్చే కీర్తి ప్రతిష్ఠలు లేకపోయినా, ఒక సరళ వైజ్ఞానిక రచనను గుర్తించినందుకు అకాడెమీని అభినందిస్తున్నానని ఛానల్ వాళ్ళకు చెప్పాను. అవార్డుల ద్వారా వచ్చే గుర్తింపు కంటే ఏ రచయితకైనా ప్రజల నుండి వచ్చే గుర్తింపే చాలా గొప్పది. ప్రజామోదం ముందు ఎంత పెద్ద సంస్థ ఇచ్చే అవార్డయినా చిన్నబోయేదేనని నా భావన.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News