యుపి వరకట్నం వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
బావ, అత్తగారిపై చర్యలను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: వైవాహిక వివాదాల్లో భర్త కుటుంబ సభ్యులను ఎఫ్ఐఆర్లో యదాలాపంగా చేర్చడం ద్వారా వారిని నిందితులను చేర్చడం చాలా సందర్భాల్లో పరిపాటిగా మారిందని పేర్కొన్న సుప్రీంకోర్టు ఒక వరకట్నం వేధింపుల కేసులో ఒక పురుషుడు, ఒక మహిళపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టి వేసింది. కోర్టులో లొంగిపోయిన తర్వాత బెయిలు మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా ఈ కేసులో మృతురాలి బావ, అత్తగారిని జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ హృషీకేశ్ రాయ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కారు, 10లక్షల రూపాయలు అదనపు కట్నం కింద తీసుకు రావాలని డిమాండ్ చేస్తూ తన కుమార్తెను భర్త, అత్తగారు. ఆడబిడ్డ, బావగారు నిరంతరం వేధించే వారని, తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో పది రోజుల క్రితం తీవ్రంగా కొట్టారని, చంపేస్తామని బెదిరించారని మృతురాలి తండ్రి 2018 జూలై 25న గోరఖ్పూర్లోని కొత్వాలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇదే క్రమంలో ముందు రోజు (24వ తేదీ) రాత్రి గొంతుకు ఉరి వేసి తన కుమార్తెను చంపేశారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చడాన్ని బట్టి చూస్తే యదాలాపంగా వారి పేర్లను చేర్చినట్లు అర్థం అవుతోందని, పేర్కొన్న వివరాలు నేరంలో వారి చురుకైన పాత్ర ఉన్నట్లు నిరూపించడం లేదని, అందువల్ల వారిపై చర్య తీసుకోవడం సరి కాదని బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది. ఇలాంటి కేసులను పరిగణనలోకి తీసుకోవడం న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని కూడా బెంచ్ పేర్కొంది. వైవాహిక వివాదాల్లో భర్త తరఫు కుటుంబ సభ్యులందరినీ నిందితులుగా చేర్చడం చాలా సందరాల్లో సాధారణమై పోయిందని ఇటీవల ఇచ్చిన తీర్పులో బెంచ్ స్పష్టం చేసింది.