డిమాండ్లపై అధికారిక హామీ కోరుతున్న ఎస్కెఎం
నేడు మరోసారి భేటీ కానున్న ఎస్కెఎం కమిటీ
న్యూఢిల్లీ: తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ముసాయిదాలేఖ అందిందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం) బుధవారం వెల్లడించింది. మంగళవారం కేంద్రం పంపిన లేఖలో చేసిన ప్రతిపాదనలపై ఎస్కెఎం మరింత స్పష్టత కోరిన నేపథ్యంలో సవరణలతో మరో లేఖ పంపినట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. తాజా ప్రతిపాదనలపై ఎస్కెఎం ఐదుగురు సభ్యుల కమిటీ బుధవారం చర్చించింది. కేంద్రంతో వ్యవహరించాల్సినతీరుపై కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఉన్నదని ఎస్కెఎం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, కేంద్రం నుంచి అధికారికమైన హామీలు పొందాల్సి ఉన్నదని ఎస్కెఎం ఆ ప్రకటనలో పేర్కొన్నది.
ఆందోళన విరమించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, గురువారంనాడు కమిటీ మరోసారి భేటీ అవుతుందని రైతునేత గుర్నామ్సింగ్చాదునీ తెలిపారు. మంగళవారం పంపిన ప్రతిపాదనలపై తమ అభ్యంతరాలమేరకు బుధవారం పంపిన లేఖలో కేంద్రం మార్పులు చేసిందని ఆయన తెలిపారు. అయితే, కేంద్రం ప్రతిపాదనలేమిటన్నదానిపైగానీ, ప్రభుత్వంతో నేరుగా చర్చలు ఎందుకు జరపడంలేదన్నదానిపైగానీ వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని మరో రైతునేత శివకుమార్కక్కా అన్నారు.
తమ డిమాండ్లన్నిటికీ కేంద్రం నుంచి హామీ లభించేవరకూ ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనను విరమించబోమని ఎస్కెఎం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎస్కెఎం డిమాండ్లలో ప్రధానమైనదైన మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. పంటలకిచ్చే కనీస మద్దతు ధర(ఎంఎస్పి)కి చట్టపరమైన హామీ, ఆందోళనకాలంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, ఆందోళనకారులపై క్రిమినల్ కేసులు ఎత్తివేయడమనేవి ఎస్కెఎం మరికొన్ని ప్రధాన డిమాండ్లు. దేశంలోని 40కిపైగా రైతు సంఘాలకు ఐక్యవేదికగా ఉన్న ఎస్కెఎం తమ తరఫున కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఐదుగురు సభ్యుల కమిటీని ఈ నెల 4న ప్రకటించింది. దాంతో,కమిటీనే రైతుల ఆందోళన విరమణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.