Tuesday, April 30, 2024

సోయం బాబురావు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

- Advertisement -
- Advertisement -
తెలంగాణలో బిజెపి మణిపూర్ లాంటి కుట్రలు
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడ్ ధర్మనాయక్

హైదరాబాద్ :  రాష్ట్రంలో లంబాడీలను గిరిజన జాబితా నుండి తొలగించాలని మణిపూర్ మారణహోమం తరహాఆందోళన చేస్తామని ఎంపి సోయం బాబురావు పేర్కొనడం దారుణమని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడ్ ధర్మనాయక్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన వైఖరిని వ్యతిరేకిస్తూ సోయంబాబురావు బిజెపి ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వీ.రాంకుమార్ నాయక్ కలిసి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాజకీయ లభ్దిపొందేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని, బీజేపి పార్టీ అండదండలతోనే ప్రశాంతంగా ఉన్న గిరిజనుల మధ్య ఘర్షణలకు తెరలేపారని ఆరోపించారు.

ఒకవైపు యావత్ దేశం బిజెపి పాలిత మణిపూర్ మారణ హోమంపై స్పందిస్తుంటే సోయం బాబురావు మాత్రం ఇక్కడ అటువంటి మరణ హోమం తెలంగాణలో సృష్టిస్తామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన తెగల ప్రజలపై దాడులు,హత్యలు,మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక హత్యాచారాలకు పాల్పడుతుంటే కనీసం ఖండించకూడా మతోన్మాదుల చేతిలో కీలుబొమ్మగా సోయం బాబురావు మారాడని విమర్శించారు. ఒకవైపు కేంద్ర బిజెపి ప్రభుత్వం గిరిజన హక్కులకు భంగం కలిగే విధంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న అడవులు, అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టెందుకు పార్లమెంట్ లో చట్టం చేస్తే కనీసం వ్యతిరేకించలేదని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై గిరిజనులు పోరాడకుండా పక్కదారి పట్టించాలానే ఉద్దేశంతోనే బిజెపి పార్టీ ఇటువంటి కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. లంబాడీలను గిరిజన జాబితా నుండి తొలగించాలని గతంలో ప్రధాని నరేంద్ర మోడీకి 45 మంది బిజెపి పార్లమెంట్ సభ్యుల సంతకాలతో వినతిపత్రం ఇచ్చారని, ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా,గిరిజన వ్యవహాకాల శాఖ మంత్రులకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

రాజ్యాంగబద్ధంగా 1976లో ఎస్టీ జాబితాలో కలిపిన లంబాడీ గిరిజనులను తొలగించడం సాధ్యం కాదని సోయం బాబు రావుకు తెలిసినా ఆదివాసి గిరిజనులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే బిజెపి నాటకం ఆడుతోందన్నారు. బాబురావు వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే సోయం బాబురావు వ్యాఖ్యలపై గిరిజన తెగల మధ్య ఘర్షణ జరిగితే బిజెపి పార్టీనే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లచ్చిరాం నాయక్, లింబియా, నాయక్ చిన్న, మహేష్, శ్రీను జాను, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News