ఎంఎల్సి కల్వకుంట్ల కవితను కలిసి వెల్లడించిన జెఎసి ప్రతినిధులు
రూ.267 కోట్ల మోటారు వాహన పన్ను రద్దు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
టిఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేస్తామన్న టాక్సీ ఓనర్లు, డ్రైవర్ల జెఎసి
హైదరాబాద్ : కరోనా కాలంలో తీవ్రంగా నష్టపోయిన ప్రైవేటు రవాణా రంగానికి రూ.267 కోట్ల మోటారు వాహన పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర టాక్సీ ఓనర్లు, డ్రైవర్ల జెఎసి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఎంఎల్సి కల్వకుంట్ల కవితను కలిసిన టాక్సీ ఓనర్లు, డ్రైవర్ల జెఎసి ప్రతినిధులు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. కరోనా కాలంలో నష్టపోయిన ప్రతి రంగాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా వారికి కవిత భరోసానిచ్చారు. కరోనా కాలంలో (మార్చి నుండి సెప్టెంబర్) లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ పోర్టు వాహనాల నిర్వహకులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మానవతా దృక్పథంతో స్పందించిన సిఎం కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,37,611 వాహనాలకు సంబంధించిన రూ.267 కోట్ల(రెండు త్రైమాసికాలు) మోటారు వాహన పన్నును మాఫీ చేస్తున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు.
State Taxi Owners and Drivers JAC support for TRS