Saturday, April 27, 2024

గంజాయి సాగుపై ఉక్కుపాదం: శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

Strict measures if cannabis is cultivated in villages

ఆబ్కారీ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో కట్టడి చర్యలు చేపట్టాలి

మనతెలంగాణ/ హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు సాగు చేస్తున్న, రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. ఆదివారం వరంగల్‌లోని కాకతీయ హరిత హోటల్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌తో కలసి ప్రొహిబిషన్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారుల సమన్వయ సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. గంజాయి సాగు చేస్తున్న రైతుల, పండిస్తున్న భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులతో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో గంజాయి రవాణా చేస్తున్న వారిపై, అనుమానితులపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. గంజాయి రవాణా చేస్తున్న సాగు చేస్తున్న వారిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేసి బైండోవర్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.

సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు వివిధ విద్యాసంస్థల్లో మత్తు పదార్థాలకు అలవాటు పడిన విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, విద్యాసంస్థల నిర్వాహకులకు ఆబ్కారీ శాఖ, పోలీస్ శాఖల అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. గంజాయి సాగుచేస్తున్నా, రవాణా చేస్తున్న వారిపై, అందుకు సహకారాన్ని అందించే ఎంతటి వారైనా వారిని చట్టరీత్యా కేసులు నమోదు చేసిన అధికారులకు ప్రభుత్వం తరపున అవార్డుల ను అందించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు చేస్తున్నా వారిని యువకులు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతగా భావించి ఆబ్కారీ, పోలీస్ శాఖల అధికారులకు సమాచారం అందించాలని మంత్రి కోరారు.

గ్రామాల్లో గంజాయి సాగు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రచారం నిర్వహించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రైల్వే, బస్సుల్లో గంజాయి రవాణా కాకుండా సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ వరంగల్ జిల్లా సూపరిటెండెంట్ శ్రీనివాసరావు, శంషాబాద్ సూపరిటెండెంట్ సత్యనారాయణ, ఎఈఎస్ కరమ్ చంద్, హనుమకొండ ఎసిపి జితేందర్‌రెడ్డి, సుబేదారి సిఐ రాఘవేంద్ర, హన్మకొండ ఆబ్కారీ శాఖ సిఐ రామకృష్ణ, పోలీసు, ఆబ్కారీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News