Wednesday, May 1, 2024

భారత్‌లో కరోనా బయటపడి నేటితో రెండేళ్లు

- Advertisement -
- Advertisement -

It's been two years since Corona detect India

టీకా, కొవిడ్ నిబంధనలే ఆయుధాలుగా సాగుతున్న పోరు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మొదట బయటపడి నేటితో ( జనవరి 30) రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్ల కాలంలో 4 కోట్ల మందిలో వైరస్ వెలుగు చూడగా, 4 లక్షల 94 వేల మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. ఓవైపు వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తూనే మరోవైపు కొవిడ్ నిబంధనలతో కరోనా మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయినా కరోనాను నయం చేసే కచ్చితమైన చికిత్స మాత్రం ఇంకా అందుబాటు లోకి రాకపోవడం నిరాశ కలిగించే విషయం. భారత్‌లో జనవరి 30 న తొలి కరోనా కేసు నమోదైంది. వుహాన్ యూనివర్శిటీలో మెడిసిన్ చదువుతోన్న ఓ భారత విద్యార్థినికి తొలుత పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేరళకు చెందిన ఆ యువతి సెమిస్టర్ సెలవుల్లో భారత్‌కు వచ్చిన సమయంలో వైరస్ వెలుగు చూసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో పలు దఫాల్లో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో దేశంలో మూడో వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇలా కొత్త వేరియంట్ల రూపంలో విజృంభిస్తోన్న కొవిడ్ మహమ్మారితో ప్రపంచ దేశాలు మరిన్ని వేవ్‌లను ఎదుర్కొంటున్నాయి.

పెరిగిన ఔషధాల వాడకం

కొవిడ్ వ్యాక్సిన్ గత ఏడాది నుంచి అందుబాటు లోకి రావడంతో యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ వ్యాధిని నయం చేసే సరైన చికిత్స కోసం గత రెండేళ్లుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇంకా కచ్చితమైన చికిత్స మాత్రం అందుబాటు లోకి రాలేదు. ఇటు భారత్‌లో కొవిడ్ నియంత్రణకు ఔషధాల వాడకం విపరీతంగా పెరగడం పట్ల నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్ ఆందోళన వెలిబుచ్చారు. కేవలం ఆరోగ్యశాఖ సూచించిన ఔషధాలను మాత్రమే తగిన మోతాదులో వాడాలని సూచించారు. తీవ్ర లక్షణాలు ఉంటే తప్ప ఎక్కువ ఔషధాలు స్టెరాయిడ్లు విరివిగా వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరించారు.

టీకాయే బ్రహ్మాస్త్రం…

కరోనా తీవ్రతను తగ్గించడానికి ప్లాస్మా థెరపీ, రెమ్‌డెసివిర్, డీఆర్‌డీఒ తయారు చేసిన 2 డీజీ ఔషధంతోపాటు ఇటీవల మోల్నూపిరవిర్ వంటి ఔషధాలతో ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ కొవిడ్ బాధితులు కోలుకునేందుకు ప్రత్యేకంగా కచ్చితమైన ఔషధం మాత్రం ఇప్పటికీ అందుబాటు లోకి రాలేదు. మరోవైపు కొవిడ్‌ను నయం చేయడంలో యోగా, ధ్యానం వంటి వాటితోనూ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో ఒమిక్రాన్ రూపంలో మరో వేవ్ ముంచుకొచ్చింది. దీని ప్రాబల్యాన్ని తగ్గించడానికి వ్యాక్సిన్, కొవిడ్ నిబంధనలను మాత్రమే కీలక ఆయుధాలుగా కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే 95 శాతానికి పైగా అర్హులకు వ్యాక్సిన్ అందడమే లక్షంగా వ్యాక్సిన్‌ను అందించాల్సిన అవసరాన్ని ప్రధాని మోడీ ఇటీవలే స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ల దృష్టా కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నవారికి ప్రికాషనరీ డోసు పేరుతో మూడో డోసును కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది మరోవైపు చిన్నారులకు టీకా అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News