ప్రధాని మోడీకి నర్తకి సుధాచంద్రన్ విజ్ఞప్తి
నర్తకికి క్షమాపణ చెప్పిన సిఐఎస్ఎఫ్
ముంబయి: వృద్ధులకు ఇస్తున్నట్టే కృత్రిమ అవయవధారులమైన తమకూ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రముఖ నటి, భరత నాట్యం కళాకారిణి సుధాచంద్రన్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. కృత్రిమ అవయవధారులకు దేశంలోని విమానాశ్రయాల్లో తీవ్ర అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రధాని మోడీకి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. విమానాశ్రయాల్లో సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది ప్రతిసారీ తనను కృత్రిమ కాలు తొలగించి చూపాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆమె తెలిపారు. తనలాంటి మహిళలకు ఇది ఎంతో ఇబ్బందికరమని ఆమె పేర్కొన్నారు. తమ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల దృష్టికి తేవడానికే వీడియోను పోస్ట్ చేసినట్టు ఆమె తెలిపారు.
దీనిపై సిఐఎస్ఎఫ్ స్పందించింది. సుధాచంద్రన్కు అసౌకర్యం కల్పించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నది. నిబంధనల ప్రకారం తమ మహిళా సిబ్బంది అలా చేయాల్సి వచ్చిందని, ఇకముందు అలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సుధాచంద్రన్ 1981లో తన 16వ ఏట ఓ ప్రమాదంలో కుడి కాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమెకు జైపూర్ కాలును అమర్చారు. దాంతో, ఆమె తిరిగి నాట్యం చేయడం ప్రారంభించారు. మయూరి సినిమాలో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది. దేశ, విదేశాల్లోనూ కృత్రిమ కాలుతో ఆమె పలు ప్రదర్శనలిచ్చారు.