ధోనీ సేనకు మరో ఓటమి
దుబాయి : ఐపిఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్కింగ్స్ను ఓడించింది. హైదరాబాద్కు ఇది టోర్నీలో వరుసగా రెండో గెలుపు. ఇంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ను హైదరాబాద్ ఓడించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రియం గార్గ్ అద్భుత బ్యాటింగ్తో హైదరాబాద్ను ఆదుకున్నాడు. చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గార్గ్ 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, సిక్సర్తో 51 పరుగులు సాధించాడు. అభిషేక్ శర్మ 4 ఫోర్లు, ఒక సిక్స్తో వేగంగా 31 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ డేవిడ్ వార్నర్ (28), మనీష్ పాండే (29) తమవంతు పాత్ర పోషించడంతో హైదరాబాద్ కాస్త మెరుగైన స్కోరును సాధించింది.
తర్వాత బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. హైదరాబాద్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్తో బౌలింగ్ చేసి చెన్నైను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. రషీద్ ఖాన్ మరోసారి అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి చెన్నైని కట్టడి చేశాడు. చెన్నై జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజాలు మాత్రమే రాణించారు. ధాటిగా ఆడిన జడేజా ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ధోనీ 47 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.