బిసిసి కార్యదర్శి జై షా
ముంబై: భారత్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి మార్చే అవకాశాలున్నాయని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. భారత్లో కరోనా వ్యాధి పూర్తిగా తగ్గక పోవడం, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండడం తదితర కారణాల నేపథ్యంలో వరల్డ్కప్ను యుఎఇకి తరలించడమే మంచిదనే నిర్ణయానికి బిసిసిఐ వచ్చిందన్నారు. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రత తమకు ముఖ్యమన్నారు. దీంతో భారత్లో టోర్నీని నిర్వహించే విషయంలో పలుసార్లు ఆలోచించాల్సి వస్తుందన్నారు.
అయితే పలు ధపాలుగా జరిగిన అంతరంగిక సమావేశంలో టోర్నీని విదేశాలకు తరలించడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు జై షా వివరించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తామన్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఐపిఎల్ మిగిలిన దశను యుఎఇకి తరలించిన విషయాన్ని షా గుర్తు చేశారు. మరోవైపు టి20 ప్రపంచకప్ వేదికను కూడా మార్చడం ఖాయమని సూచన ప్రాయంగా వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలో దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఇదిలావుండగా మెగా టోర్నీని యుఎఇలో నిర్వహించడంపై ఇప్పటికే తగిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఐపిఎల్ ముగిసిన వెంటనే యుఎఇలోనే ఈ వరల్డ్కప్ నిర్వహించడం సబబుగా భావిస్తున్నట్టు జై షా వివరించారు.