భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్ హాస్పిటల్స్ హెల్త్ఫెస్ట్ 2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ మంగళవారం ఒయు మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్తో కలిసి తాల్ హాస్పిటల్స్ సిఇఒ సాయి గుండవెల్లి నగరంలో కెటిఆర్కు కలిసి ఆహ్వానించారు. 2025 అక్టోబర్ 24న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో (యుసిఎస్డి)లో ఈ ‘హెల్త్ఫెస్ట్ 2025’ నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు, మార్పు తీసుకొచ్చేవారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణపై చర్చించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం.
ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ),వ్యక్తిగత వైద్యం, డిజిటల్ హెల్త్కేర్ ఆవిష్కరణలు, సమీకృత వైద్య సంరక్షణ, ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలకు మార్గాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో కెటిఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. తెలంగాణలో టెక్నాలజీ ఆధారిత పాలన, ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి, ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన విధానాలు ప్రపంచ ప్రజలకు ఎంతో విలువైనవిగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
తమ ఆహ్వానాన్ని కెటిఆర్ అంగీకరించినందుకు టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపింది. హెల్త్ఫెస్ట్ 2025లో ఆయన భాగస్వామ్యం ఈ వేదికపై అర్థవంతమైన చర్చలకు దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.