Sunday, May 5, 2024

త్వరలో తాలిబన్ల సర్కార్

- Advertisement -
- Advertisement -

Talibans will soon form a new government in Afghanistan

నియంత్రణ అంతా అఖుంద్జాదాదే , కార్యాచరణ ఘనీ బరాదరి : తాలిబన్ల ప్రకటన

కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో త్వరలోనే తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. తాలిబన్ల సుప్రీం కమాండర్ హైబతుల్లా అఖుంద్జాదానే ఇక్కడ ఏర్పడే ఎటువంటి పాలక మండలికి అయినా సారధి, అధినేత అవుతాడని తాలిబన్ల సాంస్కృతిక వ్యవహారాల కమిషన్ సభ్యులు బిలాల్ కరిమి బుధవారం తెలిపారు. అఫ్రఫ్ ఘనీ సారధ్యపు ప్రభుత్వపు సేనలను చిత్తుచేస్తూ ఇటీవలే తాలిబన్లు దేశంలోని అత్యధిక ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆగస్టు 31వ తేదీతో దేశంలో అమెరికా సేనల సంపూర్ణ స్థాయి నిష్క్రమణ గడువు ముగిసింది. ఈ దశలోనే తాలిబన్లు, ఇతర అఫ్ఘన్ నేతల మధ్య సత్వర నూత న ప్రభుత్వ ఏర్పాటుకుసంబంధించి పలు దఫాల చర్చల తరువాత ఏకాభిప్రాయం కుదిరింది. కేబినెట్ ఏ విధంగా ఉండాలి? ప్రభుత్వ రూపురేఖలు ఏమిటీ? అనే అంశంపై ఎట్టకేలకు ఆమోదయోగ్య నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడైంది. తాలిబన్ల అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక నేత నాయకత్వంలోనే కేబినెట్ నిర్వహణ సాగుతుంది. వచ్చే కొద్ది రోజులలోనే నూతన ప్రభుత్వ ఏర్పాటు గురించి కీలక ప్రకటన వెలువడుతుందని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటికీ కల్లోల స్థితిలోనే ఉన్న దేశానికి సరైన ప్రభుత్వ ఏర్పాటుతోనే జవాబుదారి పాలనను, ముం దుగా పరిస్థితులను చక్కబెట్టడం చేయాలని తాలిబన్లు సంకల్పించారు.

తమ తదుపరి ప్రభుత్వంలో ప్రధాన పాత్రధారుల గురించి తాలిబన్ల కల్చరల్ కమిషన్ సభ్యులు బిలాల్ సూచనప్రాయంగా వివరించారు. సంస్థ అత్యున్నత నేత అఖుంద్జాదాకు నమ్మకస్తులు, దూతలుగా ఉండే ముగ్గురు నేతలలో ప్రధాన వ్యక్తి అయిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదరి ప్రభుత్వ దైనందిన కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలో ఉంటారని బిలాల్ తెలిపారు. ఇప్పటివరకూ ఘనీ బరాదరినే తాలిబన్ ప్రధాన వ్యక్తిగా బహిరంగంగా బయట తరచూ కన్పిస్తూ వస్తున్నారు. హైబతుల్లా ఎక్కడా ప్రజల ముందుకు రాలేదు. ఇస్లామిక్ ఎమిరేట్స్ నేతల పరిధిలోనే సంఘటిత, సమ్మిశ్రిత ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. దీనికి సంబంధించిన సంప్రదింపుల క్రమం అధికారికంగా ఇక ముగిసినట్లే అని బిలాల్ తెలిపారు. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్న నేతలు, పలుకుబడి, ప్రభావం చూపే వారితో చర్చలు జరిగాయని వివరించారు. అంతా ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపారు. అతి కొద్ది రోజులలోనే కేబినెట్ గురించి, ప్రభుత్వ నిర్వహణ గురించి తెలియచేయడం జరుగుతుందని, ఇందుకు వారాల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మా లోయ మాదే : పంజ్‌షీర్లు
తాలిబన్లతో చర్చలు విఫలం

అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లకు మారుమూల ప్రాంతంలోని పంజ్‌షీర్ విసిరిన సవాలు మరింత తీవ్రతరం అయింది. తాలిబన్లకు, పంజ్‌షీర్ల నేతలకు మధ్య బుధవారం జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా విఫలం అయ్యాయి. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థలు నిర్థారించాయి. తాలిబన్ల ఆధిపత్యానికి ఈ లోయ ప్రాంతం నుంచి వెలువడుతున్న తీవ్రస్థాయి ప్రతిఘటన ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం అయింది. తాలిబన్ల తదుపరి ప్రభుత్వ స్థాపనకు విఘాతం కాకపోయినా విఘ్నం అయింది. తాలిబన్లు ఇప్పటికే పలు అంశాలపై సరైన వాతావరణం ఏర్పాటుకు వివిధ మండళ్లు ఏర్పా టు చేసుకున్నారు. వీటిలో ఒక్కటైన మార్గదర్శకం, ప్రోత్సాహకాల కమిషన్ అధినేత ముల్లా అమీర్ ఖాన్ మోతాఖీ విలేకరులతో మాట్లాడుతూ పంజ్‌షీర్ నేతలతో జరిపిన చర్చలు విఫలం అయిన విషయాన్ని నిర్థారించారు. పంజ్‌షీర్, పర్వాన్ ప్రొవిన్స్‌లకు చెందిన గిరిజన నేతలతో జరిపిన సంప్రదింపులు తాము చేసిన రాజీ యత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని తెలిపారు. వారు తలపడాలనుకుంటున్నట్లుగా ఉందని, తలపడే వారితో మాటలు కలపవచ్చా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయని అన్నారు.

పంజ్‌షీర్ ప్రజలకు ఆ తరువాత ఆయన తరఫున ఓ ఆడియో సందేశాన్ని అమీర్‌ఖాన్ వెలువరించారు. ‘సోదరులారా.. పంజ్‌షీర్ సమస్య ను చర్చలతో పరిష్కరించాలని రంగంలోకి దిగాం. అయి తే ఫలితం లేకుండా పోయింది’ అని ఇందులో తెలిపా రు. తాలిబన్లను ఈ లోయలోకి రానిచ్చేది లేదని పంజ్‌షీర్ నేత అహ్మద్ మసూద్ తేల్చిచెపుతున్నారు. ఇతరులకు దుర్భేధ్యం అయి, స్థానిక గిరిజనులకు కంచుకోట అయిన ఈ లోయ, కొండల ప్రాంతం తమ వశం చేసుకునేందుకు తాలిబన్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి బెడిసికొట్టాయి. మరోవైపు వారితో జరిపిన చర్చలు విఫ లం అయ్యాయి. దీనితో తాలిబన్లకు ఎదురవుతున్న ప్రతిఘటన ఇప్పటికీ కొనసాగుతూ జటిలం అయింది. సోవియట్ యూనియన్‌లు తమ లోయలోకి రాకుండా అప్ప ట్లో యత్నించి తరువాత వధించిబడ్డ నేత అహ్మద్ షా మసూద్ కుమారుడు, విద్యాధికుడు అయిన జూనియర్ మసూద్ నాయకత్వంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరు సాగుతోంది. వీరికి దేశ మాజీ ఉపాధ్యక్షులు అమ్రుల్లా సలేహ్ సారథ్యపు బలగాలు మద్దతు ప్రకటించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News