Wednesday, May 1, 2024

తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

- Advertisement -
- Advertisement -

పరిశోధనలో యుఎస్‌డిఏ సహకారం ఆశిస్తున్నాం
అమెరికా పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రైతాం అధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మ్యానేజ్మెంట్, మార్కెటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, న్యుయర్ ప్లాంటింగ్ టెక్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాల గురించి మూడో రోజు పర్యటనలో యుఎస్‌డిఏ(యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్) ప్రతినిధులతో మంత్రి బృందం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ వ్యవసాయం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.ఉపాధి కల్పనలో వ్యవసాయ, దాని అనుబంధరంగాల పాత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసని అందుకే వ్యవసాయ అనుకూల విధానాలకు పెద్దపీట వేసి రైతులను ప్రోత్సహిస్తున్నారన్నారు.సమైక్య పాలనలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో సంబరంగా మారిందన్నారు.

ప్రపంచంలోఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి అందించడమే కాకుండా రైతుభీమాతో వ్యవసాయ కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు పూడిక తీసి చెరువులకు మళ్ళీ జలకళ సంతరించుకునేలా చేయడమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, పాలామూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి గోస తీర్చినట్లు వెల్లడించారు.వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ ఉచితంగా అందిస్తుండటంతో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో నీళ్ళు, కరెంట్ పుష్కలంగా ఉండటం, సాగు విస్తీర్ణం పెరగడం, ఉపాధి అవకాశాలు లభిస్తుండడంతో వలసలు ఆగిపోవడమే కాకుండా వలస వెళ్ళినవారు తిరిగి గ్రామాలకు వాపస్ వస్తున్నారన్నారు.వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ని దాటిపోయిందన్న మంత్రి నిరంజన్ రెడ్డి భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ పంటలు పండించడానికి అనువుగా ఉంటుందన్నారు.భారతదేశంలో వనరులతో మన దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకు ఆహారాన్ని అందించగలం .. అలాగే విదేశాలకు కూడా ఎగుమతి చేయగలగాలి. నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని మనం భావిపౌరులకు అందించాలన్నారు.

అమెరికా పర్యటనలో భాగంగా మూడవ రోజు వాషింగ్టన్ డీసి లో ఉన్న ఎన్‌ఐఎఫ్‌ఏ(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్) సందర్శన మంత్రి నిరంజన్ రెడ్డి ఎన్‌ఐఎఫ్‌ఏ డైరక్టర్ మంజిత్ మిశ్రా ఇతర అధికారులుతో మంత్రి సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఎన్‌ఐఎఫ్‌ఐ డైరెక్టర్ మంజిత్ మిశ్రా మాట్లాడుతూ ఏ దేశంలో అయినా వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యమనీ, కానీ ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకం అని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు అని, వరల్ ఫుడ్ ప్రైజ్ ఆర్గనైజేషన్‌లో ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ని కలిసినట్లు చెప్పారు.ఈ సమావేశంలో యుఎస్‌ఏడి ప్రతినిధులు,తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు ఉన్నారు.

Niranjan 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News