Saturday, April 27, 2024

వ్యవసాయ రంగంలో తెలంగాణ పంచ విప్లవం

- Advertisement -
- Advertisement -

దీనివల్ల రైతుల ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది
దేశంలోనే తెలంగాణ అత్యంత విజయవంతమైన రాష్ట్రం
నాయకత్వానికి చిత్తశుద్ధి, విజన్ ఉంటేనే ప్రగతి, పాలనా విజయాలు సాధ్యం
ఐఎస్‌బి క్యాంపస్‌లో మంత్రి కెటిఆర్

హైదరాబాద్:  దేశంలోనే తెలంగాణ అత్యంత విజయవంతమైన రాష్ట్రమని- మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. నాయకత్వానికి చిత్తశుద్ధి, విజన్ ఉంటేనే ప్రగతి, పాలనా విజయాలు సాధ్యమన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పంచ విప్లవాలను సృష్టిస్తోందని, రానున్న కాలంలో వీటి సాయంతో రైతుల ఆదాయం కచ్చితంగా అనేక రెట్లు పెరుగుతుందన్నారు. ఇదంతా కేవలం తొమ్మిది సంవత్సరాల కాలంలోనే సాధ్యమయ్యిందన్నారు. పంజాబ్ మొహాలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) క్యాంపస్‌లో (అడ్వాన్సుడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ) కోర్స్ ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ తన అనుభవాలను వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు అత్యంత సవాల్‌తో కూడుకుందన్నారు. ప్రభుత్వ పాలనకు వినూత్నమైన ఆలోచన విధానాలు, పాలసీలు అత్యవసరమన్నారు. పరిపాలకుడికి విజన్, ప్రభుత్వ యంత్రాంగాన్ని స్ఫూర్తి కలిగించే శక్తి ఉంటే ప్రభుత్వ యంత్రాంగం గొప్పగా పనిచేస్తుందని కెటిఆర్ తెలిపారు. మౌలిక వసతులపై పెట్టే ప్రతి పెట్టుబడి భవిష్యత్‌కి భరోసాను ఇచ్చేదన్నారు.

50 మిలియన్ డాలర్ల పెట్టుబడులు…24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
అనేక ప్రజాస్వామ్య పోరాటాలు, ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని ప్రగతి పథంలో నడపడంలో తాము విజయం సాధించామన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను అతి తక్కువ సమయంలో సాధించామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 8 సంవత్సరాల్లో తెలంగాణ తలసరి ఆదాయం, జిఎస్‌డిపి భారీగా పెరగడం తెలంగాణ అభివృద్ధికి ప్రాథమిక సాక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపేందుకు వినూత్న పాలసీలతో ముందుకుపోయామన్నారు. ప్రభుత్వ పరిపాలనలోనూ ప్రభుత్వ పాలసీల నిర్మాణంలోనూ ఇన్నోవేషన్‌ను తీసుకువచ్చిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన తెలంగాణ పారిశ్రామిక అనుమతుల చట్టం టిఎస్ ఐపాస్ ప్రభుత్వ పాలన ఇన్నోవేషన్‌కు అద్భుతమైన నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. టిఎస్ ఐపాస్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటిదాకా అద్భుతమైన విజయాన్ని సాధించామని, 24 వేలకు పైగా పారిశ్రామిక అనుమతులను సులభంగా ఇచ్చామన్నారు. 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకువచ్చి, 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలను అందించామన్నారు.

400 శాతం పెరిగిన ఐటి ఎగుమతులు
ప్రపంచంలోనే ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 50 శాతం త్వరలో తెలంగాణ ఉత్పత్తి చేయబోతుందన్నారు. అత్యధికంగా యూఎస్‌ఎఫ్‌డిఏ అనుమతులు కలిగిన ప్రాంతం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో అత్యధిక ఐటీ రంగ ఉద్యోగాలను అందిస్తున్న అతిపెద్ద నగరం హైదరాబాద్, దీనివల్ల 300 శాతం ఐటి ఉద్యోగుల సంఖ్య పెరిగిందని, 400 శాతం ఐటి ఎగుమతులను పరిమాణం పెరిగిందని, ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థల ప్రాంగణాలకు హైదరాబాద్ కేంద్రం అయ్యిందని కెటిఆర్ తెలిపారు. అతిపెద్ద ఇన్నోవేషన్ ఇంకుబేషన్ సెంటర్ అయిన టి హబ్, మహిళలకు ప్రత్యేకమైన ఇంకుబేటర్ విహబ్, దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టి వర్క్ హైదరాబాద్‌లో కేంద్రీకృతమయ్యాయన్నారు. కేవలం పరిశ్రమలు, పాలసీలకే కాకుండా తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలోనూ రికార్డులు సృష్టించిందని కెటిఆర్ తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణలో..
ప్రపంచమంతా నిర్మాణరంగంలో అత్యంత వేగంగా నిర్మాణం చేసే చైనా మోడల్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో అతి తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ సాగునీటి వనరులు అందుబాటులోకి వచ్చిన ప్రాజెక్టులతో గతంలో 24 స్థానంలో ఉన్న తెలంగాణ, వరి ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానానికి చేరిందన్నారు. లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టుని నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసినా, కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం ఏ మాత్రం అందలేదన్నారు. అయినా అన్ని సవాళ్లను దాటుకొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగామన్నారు. దేశవ్యాప్తంగా పార్టీలు, ప్రభుత్వాలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని దశాబ్దాలుగా హామీలు గుప్పిస్తున్న తరుణంలో తెలంగాణ రైతుల తలసరి ఆదాయాన్ని భారీగా పెంచగలిగామన్నారు.

60 సంవత్సరాల్లో గ్రామాలకు తాగునీరు
దశాబ్ద కాలంలో తెలంగాణ మాదిరి ఇతర రాష్ట్రాలు, దేశం కానీ, ప్రగతి పథంలో ముందుకు వెళితే ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దదిగా మారేదన్నారు. ప్రభుత్వ పాలనలో తాము మాత్రమే శాశ్వతంగా ఉంటామన్న ఆలోచన విధానం నుంచి బయటకు వచ్చి, ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ నాయకులకు ఉన్న విజన్ గొప్పదైతే ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తుందని, తెలంగాణ 9 సంవత్సరాల అనుభవం ఇదే నిరూపించిందన్నారు. 60 సంవత్సరాల్లో గ్రామాలకు తాగునీరు అందించేందుకే ఇబ్బందులు పడిన ప్రభుత్వ యంత్రాంగం మూడేళ్లలో రాష్ట్రంలోని అందరికీ తాగునీరు అందించే మిషన్ భగీరథను పూర్తి చేయడం ఒక గొప్ప ఉదాహరణగా ఆయన తెలిపారు.

నాయకత్వం అంటే ప్రతిరోజు నేర్చుకోవడమే
నాయకత్వం అంటే ప్రతిరోజు నేర్చుకోవడమేనని కెటిఆర్ తెలిపారు. రేపటి రోజు బాగుంటుందన్న ఆశను ప్రజలకు అందించగలిగితే ప్రజలు ప్రభుత్వాలను పార్టీలకు మద్దతిస్తారని, వారికి అండగా ఉంటారని కెటిఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలకు అభివృద్ధి పథకాలు ప్రాజెక్టులను అమలు చేసేందుకు నిధుల కొరత అతిపెద్ద సవాల్‌గా మారిందన్నారు. అయితే అభివృద్ధి పనుల కోసం కూడా రుణాలు తీసుకోకుండా ఉండాలన్న పాతకాలపు ఆలోచన ధోరణితో దేశం ప్రగతి పథంలో ముందుకు వెళ్లకుండా వెనుకబడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు రుణాలను భవిష్యత్‌పైన పెట్టుబడిగా చూస్తుంటే భారతదేశంలో మాత్రం రుణాల విషయంలో అనేక అపోహలు ఉన్నాయన్నారు. మారుతున్న యువత ఉద్యోగం రాగానే రుణాలు తీసుకొని జీవితాలను బాగుపరచుకుంటున్న మాదిరే దేశాలు కూడా మౌలిక వసతుల కోసం అవసరమైతే రుణాలు తీసుకొని భవిష్యత్‌ను పెట్టుబడిగా భావించి ముందుకు వెళ్లాల్సిన వినూత్నమైన పరిపాలన విధానాలు ఈ దేశానికి అవసరమన్నారు.

ఒక చిన్న సంఘటన శాంతిభద్రతల విఘాతానికి..
మౌలిక వసతులపైన పెట్టే ప్రతి పైసా, దేశ భవిష్యత్‌పైన పెట్టే పెట్టుబడి గానే భావించాలని కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రాల్లో అమలవుతున్న ఆదర్శ విధానాలను ఎప్పటికప్పుడు నేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపించాలన్నారు. ఇతరుల ఆదర్శ విధానాల నుంచి స్ఫూర్తి పొందడంలో వెనుకాడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో విభజన ఎంత ఉన్న ఈ దేశం సమైక్యంగా ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు. కానీ, విభజన రాజకీయాలు పెద్ద ఎత్తున దేశంలో ఉన్న ఈ తరుణంలో స్పృహద్భావ వాతావరణంలో రాజకీయ పార్టీల మధ్య చర్చలు ఉంటాయని ఆశించడం కొంత వాస్తవ దూరమే అవుతుందన్నారు. మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడడం భవిష్యత్ అన్ని ప్రభుత్వాలకు ఒక పెద్ద సవాలుగా మారబోతుందన్నారు. ఒక చిన్న సంఘటన కూడా శాంతిభద్రతల విఘాతానికి దారి తీసే ప్రమాదం ఉందన్నారు.

విజయం సాధించాలంటే త్యాగాలు చేయాల్సిందే
ఎవరి జీవితంలో అయినా గొప్ప విజయం సాధించాలంటే అందుకు తగిన త్యాగాలు చేయాల్సి ఉంటుందని కెటిఆర్ తెలిపారు. ఇందుకు రాజకీయ నాయకులు మినహాయింపు ఏమాత్రం కాదన్నారు. రాజకీయాలను వృత్తిగా ఎంచుకునే అంశం ఎంతో సవాళ్లతో కూడుకుందన్నారు. రాజకీయాల్లో విభిన్న రంగాలలో అనుభవం కలిగిన నిపుణులు రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రాజకీయాలకు వచ్చే యువత క్షేత్రస్థాయి నుంచి పనిచేసి వస్తే విజయం సాధించే అవకాశం ఉందన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తనకు తెలంగాణ ఉద్యమం వలన ప్రజాక్షేత్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు అవకాశం దొరికిందని కెటిఆర్ తెలిపారు. రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసిన దానికన్నా కఠినమయ్యిందని కెటిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News