Sunday, April 28, 2024

అత్యధిక అవయదానాల్లో తెలంగాణదే అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  అత్యధిక అవయవ దానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనత కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగే జాతీయ అవయవదాన కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య మంత్రి చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందకుంటుందని, ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలుపుతూ సిఎం కేసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో కల్పించిన మౌలిక సదుపాయాలతో ఇది సాధ్యమైందన్నారు. గురువారం 13వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జీవన్ దాన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అవయవ దానం చేసిన కుటుంబాలను సన్మానించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ -అయిన వారిని కోల్పోయామనే బాధలో ఉండి కూడా, మరొకరికి ప్రాణం పోయాలని ఆలోచించడం, అమలు చేయడం గొప్ప విషయమన్నారు. మీ నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకమని బాధలో కూడా సామాజిక బాధ్యతను నిర్వర్తించిన మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నానని, రియల్ హీరోస్‌గా మారిన 105 కుటుంబాలను నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్బంగా ఈరోజు సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మీరు తీసుకున్న నిర్ణయంతో నేడు ఎంతో మంది పునర్జన్మ పొందారని మీ సంబంధీకులు మీ ముందు లేకపోయినప్పటికీ, మరొకరి రూపంలో మన మధ్యలోనే ఉన్నారని పేర్కొన్నారు.

నుదిటి గీతను సైతం మార్చి, ప్రాణం నిలిపిన మీరు మరో బ్రహ్మలు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదన్నారు. 2022 సంవత్సరంలో తెలంగాణలో 194 మంది అవయవ దానం చేశారు. తమిళనాడు 156, కర్నాటక 151, గుజరాత్ 148 అవయదానాలతో తర్వాతి స్ధానాల్లో ఉందన్నారు. 2013 జీవన్‌దాన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 1288 బ్రెయిన్ డెత్ డొనేషన్స్ జరిగాయి. మొత్తం 4829 ఆర్గాన్స్ సేకరించి, అవసరం ఉన్న వారికి అమర్చడం జరిగిందన్నారు. అవయవ మార్పిడి చికిత్స విషయంలోనూ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, 2022లో దేశ వ్యాప్తంగా 1675 ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు జరిగితే తెలంగాణలో 530 జరినట్లు తమిళనాడు 519, కర్నాటక 415 సర్జరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 126 ఆర్గాన్ డొనేషన్లు నమోదు కాగా జీవన్ దాన్ లో నమోదై, అవయవాల మార్పిడి చేసుకొని జీవితాన్ని పొడిగించుకోవాలని చూస్తున్న వారి సంఖ్య సుమారు 3వేలుగా ఉందని, అవయవ మార్పిడి అనగానే ఒకప్పుడు కార్పోరేట్ ఆసుపత్రులే గుర్తుకు వచ్చేవన్నారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ కు ధీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఖరీదైన ట్రాన్సాప్లాంటేషన్లు జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు నిమ్స్ లో 395, ఉస్మానియాలో 74, గాంధీలో 11 మొత్తం 480 ట్రాన్స్‌పాంటేషన్స్ జరిగాయి. ఇందులో అత్యధికంగా 436 కిడ్నీ ట్రాన్‌ప్ల్లాంట్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. గత నెలలో నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స జరిగిందని నిమ్స్ వైద్యులు ఒకే రోజు రెండుమూడు అవయవ మార్పిడులను విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు నిమ్స్ కేరాఫ్ గా మారింది.- రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చయ్యే విలువైన ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలను ప్రభుత్వం పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చేరువ చేసిందన్నారు. దీంతో పాటు సర్జరీ చేసుకున్న వారికి జీవిత కాలం పాటు నెలకు 10వేల నుంచి 20 వేల విలువ చేసే మందులను ఉచితంగా అందిస్తుందన్నారు. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, దూమపానం, మద్యపానం తదితర కారణాలతో రోగాలు చుట్టుముట్టి, చిన్న వయస్సులోనే దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. అవగాహన లేమి, నిర్లక్ష్యం కారణంగా రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, పరీక్షలు చేయించుకొని వైద్యం పొందక పోవడంతో ఆ రోగాలు ముదిరి అవయవాలపై చెడు ప్రభావం చూపుతున్నాయన్నారు.

బీపీ, షుగర్ సమస్యలను నిర్లక్ష్యం చేయడంతో దీర్ఘకాలంలో కిడ్నీలు, కాలేయం, కంటి సమస్యలు ఎదురై ఆర్గాన్స్ ఫెయిల్ అవుతున్నాయి. అవయవాలు మార్పిడి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కిడ్నీ, కాలేయం, గుండె తదితర అవయవాలను కృత్రిమంగా తయారు చేయలేము. అంతటి సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు. మరణించిన తర్వాత విలువైన అవయవాలు మట్టిలో కలిపే కంటే దానం చేయడం ఎంతో మిన్న. బ్రెయిన్ డెడ్ అయిన సందర్బాల్లో కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతను నిర్వర్తించి, ఆర్గాన్ డోనేషన్ ద్వారా ప్రాణం పోయాలని సూచించారు. -బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను సేకరించి అవసరమైన రోగులకు దానం చేయవచ్చు. ఒక్క వ్యక్తి నుంచి సేకరించిన ఆర్గాన్స్తో 8 మందికి ప్రాణం పోయవచ్చన్నారు. అవయవదానం విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తొలిసారిగా తెలంగాణ ఆన్లైన్ పోర్టల్ ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం సహా ఏపీ, కేరళ, గుజరాత్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలు మన విధానాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు.

డొనేషన్లు, ట్రాన్స్ ప్లాంట్లేషన్ విషయంలో తెలంగాణ మెరుగైన పనితీరును కనబరచుతున్నదని 36 ప్రభుత్వ ఆసుపత్రులు జీవన్‌దాన్‌లో రిజిస్ట్రర్ కాగా, నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ సృష్టిలో నీ ఊపిరి ఉన్నంత వరకు నీవు చేసే ప్రతీ సాయం దేవుడు లెక్కవేస్తాడు తప్ప మూఢ నమ్మకాలను ఆచరించడంతో ప్రయోజనం ఉండదని, పుట్టుక- చావు మన చేతిలో ఉండవు కానీ మనం మరణించినా ఈ లోకంలో బతికి ఉండే ఏకైక మార్గం అవయవ దానమని అందరూ అవయవ దానం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్సీ ప్రభాకర్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News