Sunday, April 28, 2024

వరించి.. పోషించి

- Advertisement -
- Advertisement -

food-supply

దేశానికి తిండిపెట్టిన తెలంగాణ

జాతీయ నిల్వలకు తల వాటా ఇక్కడి నుంచే

యాసంగి వరి సేకరణలో 63% తెలంగాణ నుంచే
సేకరించిన 83.01 లక్షల టన్నుల్లో ఇక్కడి నుంచి వచ్చింది 52.23ల.టన్నులు
రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ ప్రభుత్వం సేకరించింది : భారత ఆహార సంస్థ సిఎండి
డి.వి ప్రసాద్ ప్రశంస

దేశానికి తిండి పెట్టే స్థాయికి తెలంగాణ ఎదగడం గర్వంగా ఉంది. పెరిగిన సాగునీటి లభ్యత, ఉచిత విద్యుత్‌ను రైతులు సద్వినియోగం చేసుకున్నారు.
– ముఖ్యమంత్రి కెసిఆర్

సిఎం కెసిఆర్ తోడ్పాటుతో తెలంగాణ రైతులు సాధించిన ప్రగతి ఇది. వ్యవసాయం వారికి లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి ఏకైక లక్షం
– మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) సిఎండి డివి ప్రసాద్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని అభినందించారు. ప్రస్తుత సంవత్సరం (20 20) యాసంగిలో తాము సేకరించిన మొత్తం ధాన్యంలో 63 శాతం కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచేనని తెలిపా రు. మిగిలిన అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 37 శాతం సేకరించినట్లు ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఈ సారి ప్రభుత్వ రంగ సంస్థలు రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిపాయని సిఎండి చెప్పారు. దేశ వ్యాప్తంగా ఎఫ్‌సిఐ ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నులు సేకరించగా అందులో తెలంగాణ రాష్ట్రం నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సారి ఎఫ్‌సిఐ 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకో గా, అందులో సగానికి పైగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సమకూర్చిందని అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగిలో ఎక్కువ వరి పంట పండినందున అది దేశ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్లే అధిక ధాన్యం సేకరణ సాధ్యమైందన్నారు.

ఫలించిన ప్రభుత్వం కృషి

కరోనా మహమ్మారి విజృభిస్తున్న సమయంలోనూ రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సిఎం కెసిఆర్ తీసుకున్న చర్యలు, పంటలకు సరిపడ సాగునీరు, ఇరవై నాలుగు గంటల పాటు నాణ్యమైన కరెంటు సరఫరా చేశారు. దీంతో రాష్ట్రంలో పెద్దఎత్తున పంటల సాగు జరిగింది. అయితే రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 6,386 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 55.52 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దీంతో కేంద్రానికి కావాల్సిన ధాన్యం సేకరణలో పూర్తిగా చేయూత నిచ్చి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.

గతంలో సాగునీటి సౌకర్యం లేక, కరెంటు సరిగా లేక తెలంగాణలో పంటలు సరిగా పండకపోయేదని, దీంతో ధాన్యం, ఇతర పంటల దిగుబడి తక్కువ వచ్చేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సిఎం కెసిఆర్ సాగునీటి రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయాభివృద్ధికి – రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసి, సాగునీరు అందించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పెరిగింది.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీంతో అటు ప్రాజెక్టు కాల్వల ద్వారా, ఇటు చెరువుల ద్వారా, మరోవైపు బోర్ల ద్వారా పుష్కలమైన నీరు వాడుకోవడం సాధ్యమైంది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత యాసంగిలో తెలంగాణలో 17 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఈ యాసంగిలో 39.5 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. దీని ఫలితంగా తెలంగాణలో వరి ధాన్యం రికార్డు స్థాయిలో పండింది. పండిన పంట రాష్ట్ర అవసరాలు తీర్చడంతో పాటు, దేశ అవసరాలను కూడా తీరుస్తున్నది.

రైతులకు సిఎం కెసిఆర్ అభినందనలు

రైతులకు సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తాము సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచి సేకరించిందే అత్యధిక భాగమని ఎఫ్‌సిఐ ప్రకటించిన నేపథ్యంలో రైతులపై సిఎం ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి లభ్యతను, ఉచిత విద్యుత్తును సమర్థవంతంగా వినియోగించుకున్న తెలంగాణ రైతులు తమ వృత్తి నైపుణ్యంతో పంటలు పండించారని అభినందించారు. కాగా సిఎం కెసిఆర్ తీసుకున్న చర్యల ఫలితంగానే రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు పెరిగాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. దేశానికి అవసరమైన ధాన్యంలో ఎక్కువ శాతం తెలంగాణ నుంచి వెళ్లడం వెనుక కెసిఆర్ దార్శనికత ఉందన్నారు. బుధవారం ప్రగతి భవన్‌లో సిఎంను పల్లా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

గర్వంగా ఉంది….కెటిఆర్

తెలంగాణ రైతులు సాధించిన ప్రగతిని చూస్తంటే ఎంతో గర్వంగా ఉందని అని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. వ్యవసాయరంగానికి సిఎం కెసిఆర్ అందిస్తున్న చేయూత కారణంగానే రాష్ట్రం పంటల సాగు బాగా పెరిగిందన్నారు. వ్యవసాయం రైతులకు లాభసాటిగా చేయాలన్న ఎకైక లక్షంతో సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. అందువల్లే రైతులు ఏ భూముల్లో ఎలాంటి పంటలు పండించాలి? ఎంత విస్తీరణంలో సాగు చేయాలి? తదితర అంశాలపై సంబంధిత నిపుణులతో నిత్యం సిఎం సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నారన్నారు. వారి నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్ ఆదారంగా రైతులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు జారీ చేస్తున్నారన్నారు. సిఎం పడిన కృషి, రైతుల శ్రమకు ఇప్పుడు ఫలితం కనిపిస్తోందని మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Telangana state fulfilling food supply needs of country

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News