Sunday, May 5, 2024

వాటాపై వాగ్యుద్ధం

- Advertisement -
- Advertisement -

కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్యన మాటల మంటలు!
50:50 నిష్పత్తిలో నీటిని పంచాల్సిందే: తెలంగాణ
శ్రీశైలం నుంచి ఏపి 34టిఎంసీలే వాడుకోవాలిః తెలంగాణ
532టిసీఎంలు ఎక్కడైనా వాడుతాం:ఏపి
గోదావరి మళ్లింపులో 45టిఎంసీలపైన రచ్చ
కుదరని వాటాలు తేలని లెక్కలు
రెండు నెలల్లో విశాఖకు బోర్డు తరలింపు
అజెండా అంశాలపైన మళ్లీ నాన్చివేత
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల్లో వాటాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మాటల మంటలు చెలరేగాయి. బుధవారం జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు 17వ సమావేశం వాడీ వేడిగా జరిగింది. బోర్డు చైర్మన్ నందన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపి రాష్ట్రాల నుంచి నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు, ఈఎన్సీలతో పాటు బోర్డు అధికారులు పాల్గొన్నారు. కర్ర విరగలేదు ..పాము చావలేదు అన్నరీతిలో సమావేశమైతే జరిగింది కాని అజెండాలో పేర్కొన్న ఏ అంశం పట్ల ఏకాభిప్రాయాలు కుదరకుండానే సమావేశం ముగిసింది.

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. నీటి వాడకంలో తలెత్తిన వివాదాలపై అధికారుల మధ్య మాటల యుద్దం జరిగింది. జూన్ నుంచి ప్రారంభయ్యే నీటి సంవత్సరం నుంచి కృష్ణాలో 50:50 నిష్పత్తిలో నీటిని పంచాల్సిందే అని తెలంగాణ రాష్ట్రం పట్టుబట్టింది.అంతేగాక శ్రీశైలం నుంచి ఏపికి 34టిఎంసీలు మాత్రమే వాడుకునేలా కట్టడి చేస్తేనే జలవిద్యుత్ అంశంపై ఆలోచిస్తామని తెలగాణ అధికారులు తేల్చిచెప్పారు.

పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు మళ్లించటం ద్వారా మిగులుగా ఉండే నీటిలో ఎగువ రాష్ట్రాలకు చెందాల్సిన 80టిఎంసీల నీటిలో ఏపికి ఎగువన ఉన్న తెలంగాణకే 45టిఎంసీలు చెందుతాయని తెలంగాణ అధికారులు బలమైన వాదనలు చేశారు. దీనిపై ఏపి అధికారులు అనేక అభ్యంతరాలు తెలిపారు. ఏపికి కేటాయించిన 532టిఎంసీల నీటిని తమ రాష్ట్రంలో స్థానిక అవసరాలను బట్టి ఎక్కడైనా వాడుకుంటామని ,ఒక్క శ్రీశైలం ప్రాజెక్టు నుంచే 34 టిఎంసీలు మాత్రమే వాడుకోవాలని ట్రిబ్యునల్ తీర్పులో ఎటువంటి ఆదేశాలు లేవని తెలిపారు. ఎన్‌బ్లాక్‌గా ఏపికి నీటికేటాయిపులు మాత్రమే జరిపినట్టు గుర్తు చేశారు.

ఈ అంశాలపైనే రెండు రాష్ట్రాల అధికారులు తీవ్రస్థాయిలో వాదనలకు దిగారు. దీంతో బోర్డు చైర్మన్ జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల అధికారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా రెండు రాష్ట్రాల వాదనలను , డిమాండ్లను కేంద్ర జలసంఘం దృష్టికి తీసుకుపోతమని హమీ ఇచ్చి ఆమేరకు తీర్మాణించారు. సీడబ్యుసి నుంచి తుది నిర్ణయం వచ్చేంత వరకూ ఇప్పటిదాక అమల్లో ఉన్న 66ః34 నిష్పత్తి ప్రకారం నీటిని వాడుకోవాలనే నిబంధనలనే రెండు రాష్ట్రాలు గౌరవించి అమలు చేయాల్సివుంటుందని చైర్మన్ రెండు రాష్టాల అధికారులను కోరారు. బోర్డు నిర్వహణకు నిధులు అందజేయటంలో రెండు రాష్ట్రాలు తమ సహాకారం అందించేందించేందుకు సుముఖత తెలిపాయి.ఈ సమావేశలో తెలంగాణ నుంచి స్పెషల్ సిఎస్ డా.రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏపి నుంచి ముఖ్యకార్యదర్శి శశిభూషన్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డితోపాటు రెండు రాష్టాల నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.

కేంద్రం వద్దే తేల్చుకుంటాం: స్పెషల్ సీఎస్ రజత్ కుమార్
కృష్ణాజలాల్లో 50శాతం నీటివాటాపై కేంద్ర జలసంఘం వద్దనే తేల్చుకుంటామని తెలంగాణ నీటిపారుల శాఖ స్పెషల్ సీఎస్ డా.రజత్ కుమార్ వెల్లడించారు.బోర్డు సమావేశం అనంతరం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు.నీటివాటాలపై నిర్ణయ తీసుకునేందుకు కృష్ణాబోర్డు సరైన వేదిక కాదన్నారు. 66ః34 నిష్పత్తికి ఈ సారి అంగీకరిచబోమని సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిపారు. చైర్మన్ ఇందుకు సుముఖ తెలపారని తెలంగాణ డిమాండ్‌ను కేంద్ర జలసంఘానికి రెఫర్ చేస్తామని తెలిపారన్నారు. ఏపికి శ్రీశైలం నుంచి 34టిఎంసీలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. దాన్ని అంగీకరిస్తే తాము కూడా విద్యుత్ ఉత్పత్తిపై అలోచిస్తామని, నెలరోజులు వేచి చూస్తామన్నారు. తెలంగాణకు మైనర్ ఇరిగేషన్ కింద 90టిఎంసీల కేటాయిపులు ఉన్నాయని అయితే అందులో మిషన్ కాకతీయ ద్వారా 45టిఎంసీల నీటిని మిగిల్చామన్నారు. గోదావరి నీటిని కృష్ణాకుమళ్లించం ద్వారా నాగార్జున సాగర్‌ప్రాజెక్టు ఎగువన 45టిఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్రం వాడుకునే హక్కు ఉందని అందువల్ల మొత్తం 90టిఎంసీల నీటితో పాలమూరురంగారెడ్డి పథకం చేపట్టినట్టు తెలిపారు. అన్ని వివరాలు పొందు పరిచి డిపిఆర్‌ను కేంద్ర జలసంఘానికి పంపినట్టు తెలిపారు.

కేడబ్యుడిటి సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కృష్ణజాలాల్లో 575టిఎంసీలు రావాల్సివుందన్నారు.తాగునీటి అవసరాలకు వాడే కోటాలో 20శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని బోర్డును కోరగా అధ్యయనం చేయించేందుకు అంగీకరించినట్టు తెలిపారు. కృష్ణా రిజర్వాయర్ మేనేజ్‌మెంట కమిటిలో పిళ్లై స్థానంలో కొత్తగా గుప్తా వచ్చారని జలవిద్యుత్ నిర్వహణపై ,శ్రీశైలం నుంచి నీటి విడుదల అంశాలు కమిటితో అధ్యయనం చేయించాల్సి వుందన్నారు.ఆర్డీఎస్ ఆధునీకరణ అధ్యయనం చేయించి నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని బోర్డు తెలిపిందన్నారు.హైదరాబాద్ తాగునీటి అవసరాలకోసమే సుంకిశాల చేపట్టామని దీనికి కూడ ఏపి అభ్యంతరం చెప్పిందని, అయితే బోర్డు మాత్రం పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపిందని రజత్ కుమార్ వెల్లడించారు.

ట్రిబ్యునల్‌కు మాత్రమే నీటికేటాయిపుల అధికారం :
దేశంలో ఎక్కడ ప్రాజెక్టు నిర్మించినా జలవిద్యుత్‌కోసమే అని ఉండదని, తొలుత తాగునీరు, ఆ తర్వాత సాగునీటికి ప్రాధాన్యత ఉంటుందని అడపదడపా మాత్రమే విద్యుత్‌కు ఉపయోగించుకుంటారని శ్రీశైలం ప్రాజెక్టును ఉద్దేశించి ఏపి జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషన్ కుమార్ వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయా ప్రాంతాలలో ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ జరిపిన నీటి కేటాయింపుల అధారంగానే కృష్ణానదీజలాల్లో ఏపి తెలంగాణ రాష్ట్రాల మధ్య 66ః34నిష్పత్తిలో నీటి కేటాయింపులు అమల్లో ఉన్నాయని, దీన్ని మార్చడానికి ట్రిబ్యునల్‌కు మాత్రమే అధికారం ఉంటుందన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చేదాక ఇదే నిష్పత్తిలో నీటా వాటాలు కొనసాగించేందకు బోర్డు అంగీకారం తెలిపిందన్నారు. ప్రాజెక్టుల నుంచి వరద జలాలు పొంగి పొతున్నపుడు రాష్ట్రాలు వాడుకునేనీటిని కోటా లెక్కల్లో కలపరాదని బోర్డును కోరామని తెలిపారు.గోదావరి నీటి మళ్లింపుతో మిగిలే 45టిఎంసీలలో తెలుగు రాష్ట్రాల మధ్యన ఎవరి వాటా ఎంతో ట్రిబ్యునల్ నిర్ణయిస్తుందన్నారు. లోయర్ రైపేరియన్ రైట్ కింద ఆ నీరు ఏపికే చెందుంతుందన్నారు.

రెండునెలల్లో విశాఖకు బోర్డు తరలించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకోసం ప్రభుత్వ భవనం సిద్దమవుతోందన్నారు. కృష్ణాబోర్డుకు నిల్వ నిధులు రెండు నెలలకు సరిపోతాయన్నారు. బోర్డు కోరిన విధంగా బుధవారం రూ.3.5కోట్లు ఏపి నుంచి జమ చేశామని తెలిపారు. ఉద్యోగులకు 25శాతం ఇన్సెంటివ్ కేంద్రం పరిధిలో, రికవరి అంశం కోర్టు పరిధిలొ ఉందని శశిభూషన్‌కుమార్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News