Tuesday, April 23, 2024

చల్లబడ్డ తెలంగాణ.. మరో మూడు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మారిన వాతావరణంతో తెలంగాణ రాష్ట్రం చల్లబడింది. రాష్ట్రమంతటా పగటి ఉష్ణోగ్రతులు భారీగా తగ్గాయి. కేవలం 24గంటల వ్యవధిలోనే ఇవి మూడు డిగ్రీలకు తగ్గాయి. ఇంతటి మార్పులతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారటంతో ప్రజలు ఎండల తీవ్రతనుంచి పెద్ద ఎత్తున ఉపశమనం పొందారు. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా మల్లాపూర్‌లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా , మిగిలిన ప్రాంతాల్లో కూడా అంతకు తక్కువగానే నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా తనూర్‌లో 41.8డిగ్రీలు నమోదయ్యాయి. బైంసాలో 41.2, అదిలాబాద్ జిల్లా పప్పల్‌ధారిలో 41.2, అర్లిలో 40.9, కామారెడి జిల్లా బోమనదేవిపల్లిలో 40.1 , నిజామాబాద్‌జిల్లా మన్చిప్పలో 40డిగ్రీలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 40డిగ్రీలకు లోపే ఉష్ణోగ్రతలు నమోదు కావటంలో ఎండల తీవ్రత అంతగా అనిపించలేదు.

మరో మూడు రోజలు వర్షాలు:
రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ చత్తిస్‌గఢ్ దాని పరిసిర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం , దక్షిణ తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న మరోక ఆవర్తనం మంగళవారం బలహీనపడ్డాయి. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుండి మరట్వాడ ,ఉత్తర ఇంటీరియర్ కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 40కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. రాగల మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్ , చుట్టు పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 37నుండి 40డిగ్రీల మద్యలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

నల్లగొండ జిల్లాలో భారీ వర్షం :
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్‌లో అత్యధికంగా 73.8 మి.మి వర్షం కురిసింది. ఇదే జిల్లాలోని గుడాపూర్‌లో 52.5, చందూరులో 48.3, కనగల్‌లో మి.మి వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా గంగాపూర్‌లో 40.5 మి.మి వర్షం పడింది. రాష్ట్రంలోని మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో బిజ్జిలపూర్‌లో 37, కట్టంగూర్‌లో 35, పద్రలో 33, పజ్జూర్‌లో 30.3, శాంతినగర్‌లో 29.8 నార్కట్‌పల్లిలో 29.5, పులిచర్లలో 28.3, దొండపాడులో 27.8, మర్రిగూడలో 27, తెల్దేవరపల్లిలో 26.3, ముదిగొండలో 26.3, మధిరలో 24.8 పోలేపల్లిలో 22.8, చందంపేట్‌లో 21.8, నేలకొండపల్లిలో 21.3 మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News