Friday, April 26, 2024

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల ధర్నా
ఇండస్ట్రియల్ జోన్‌కు కేటాయించిన
భూములన్నీ పంట భూములు కావడంతో
రైతుల్లో ఆందోళన ఆత్మహత్యతో
పెల్లుబికిన ఆగ్రహం కుటుంబసభ్యులతో
కలిసి నిరసన కలెక్టరేట్ వద్ద హైటెన్షన్

కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకెళ్లడానికి అన్నదాతల యత్నం
కామారెడ్డి బంద్‌కు రైతుల పిలుపు

మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి : కామారెడ్డి పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా కేంద్రంలో గురువారం ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు తమ కు టుంబ సభ్యులతో పట్టణంలోని సిఎస్‌ఐ మైదానం నుంచి కొత్త బస్టాండ్ మీదు గా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. నూతన మాస్టర్‌ప్లాన్‌పై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడానికి వెళ్లిన నేపథ్యంలో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా రణరంగంగా మారింది. రైతుల తోపులాటలు పోలీసుల అడ్డగింతలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఆ పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా చేసిన రైతులు కలెక్టర్ తమ వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అధికారులెవరూ దాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు ఒక్కసారిగా బారికేడ్లు తోసుకుంటూ కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కొందరు రైతులు పోలీసులను తప్పించుకుని గోడ దూకి కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఇద్దరు మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోగా, ఒక రైతుకు గాయాలయ్యాయి. అదేవిధంగా కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతులు ఆందోళనలో అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినా రైతుల ఆగ్రహావేశాల ముందు అవేమి పనిచేయలేదు. కాగా, విషయాన్ని ముందే పసిగట్టిన అడిషనల్ ఎస్పీ అనోన్య, డిఎస్పి సోమనాథం పోలీసు బలగాలను కలెక్టరేట్ వద్ద మోహరించారు. కాగా, కలెక్టర్ వచ్చే వరకూ ఆందోళన విరమించేదిలేదని కలెక్టరేట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్ ముందు ఇనప కంచెను ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డగించే ప్రయత్నం చేశారు.

రైతుల ఆందోళనకు బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపా రు. కామారెడ్డి బిజెపి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, జమునా రాథోడ్‌లు సంఘీభా వం ప్రకటించారు. ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. పటాన్‌చెరువు, బొల్లారం తదితర ప్రాంతా న్ని ఇండస్ట్రియల్ జోన్‌గా ఉండగా ప్రస్తుతం అక్కడ పరిశ్రమలు మూతపడటంతో ఆ ప్రాంతాన్ని రెసిడెన్సియల్ జోన్‌గా ప్రకటించిన ప్రభుత్వం కామారెడ్డిలో ఎందుకు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నా రని మండిపడ్డారు. రెండు పం టలు పండే భూములు కాకుండా వ్యవసాయానికి పనికిరాని భూములను ఇండస్ట్రియల్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌లో ము ఖ్యంగా ఇండస్ట్రియల్ జోన్ కోసం 2,700ఎకరాలు కేటాయించగా అందులో పూర్తిగా వ్యవసాయ భూములు కావడంతో రైతులు ఆందోళన బాట చేపట్టారు.

ఈ క్రమంలో బుధవారం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములు ఆత్మహత్య చేసుకోవడంతో పరిస్థితి ఒకేసారి వేడెక్కింది. ఇదే సందర్భంగా గ్రామానికి చెందిన ఉప సర్పంచ్‌తోసహా తొమ్మిది మంది పంచాయతీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, ధర్నా ప్రాంతానికి వచ్చిన సర్పంచ్‌ను తమ పదవికి రాజీనామా చేయమని గ్రామస్థులు డిమాండ్ చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.

కామారెడ్డి బంద్‌కు పిలుపు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను నిలుపుదల చేయాలంటూ ఎనిమిది గ్రామాల రైతులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో రైతులపై పోలీసుల దాష్టీకానికి నిరసనగా శుక్రవారం కామారెడ్డి బంద్‌కు రైతు నాయకులు, రాజకీయ పక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News