బ్యాంకాక్: థాయ్లాండ్లో ప్రధాని ప్రయూత్ ఛాన్ ఓచా అధికారం నిలబడింది. పార్లమెంట్లో శనివారం జరిగిన బలపరీక్షలో ఛాన్ నెగ్గారు. థాయ్లాండ్లో కరోనా వైరస్ నియంత్రణ విషయంలో ప్రధాని పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారనే తీవ్రస్థాయి విమర్శలు జోరుందుకున్నాయి. ఈ దశలోనే ఆయన ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష జరిగింది. ఇందులో నెగ్గడంతో ఇక తనను తాను అధికారికంగా మరింత బలోపేతం చేసుకునేందుకు ఆయనకు మరో అవకాశం దక్కింది. పార్లమెంట్లో విజయం సాధించినప్పటికీ మరో వైపు వీధులలో ప్రయూత్కు వ్యతిరేకంగా పలు ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి.
ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామిక వర్గాలు ర్యాలీలు చేపట్టారు. గత ఏడాదిగా ఆయన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో ఇది మరింత ఉధృతం అయింది. కొన్ని ప్రాంతాలకు పరిమితం అయిన ర్యాలీలు అత్యంత భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. వైరస్ను ప్రభుత్వం అదుపులో పెట్టలేకపోయిందని ప్రజలు మండిపడుతున్నారు. విశ్వాస పరీక్షకు ముందు విలేకరులతో మాట్లాడిన ప్రయూత్ తాను రోజురోజుకీ మరింత స్థయిర్యంతో ఎదుగుతున్నానని తెలిపారు. ప్రస్తుత విమర్శల నేపథ్యంలో కేబినెట్ విస్తరణ లేదా మార్పులు చేర్పులు ఉంటాయా? అనే ప్రశ్నకు స్పందిస్తూ ఇప్పటికైతే అటువంటి పరిస్థితి రాలేదన్నారు.