Tuesday, April 30, 2024

అమరుల త్యాగం అజరామరం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజరామరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో వారి పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. వారి స్పూర్తి వర్తమానికి అందించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే ప్రతి ఏటా అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకలలో భాగంగా చివరి రోజు అయిన అమరవీరుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించా రు.

అమరవీరులను స్మరిస్తూ ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా మోటార్ సైకిల్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి మొదలైన ర్యాలీ మెడికల్ కళాశాల, కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా, పూల సెంటర్, పిఎస్‌ఆర్ సెంటర్ మీదుగా చర్చి కాంపౌండ్, ఖమ్మం రోడ్, అమ్మా గార్డెన్స్ ఎదురుగా 100 ఫీట్ల రోడ్ నుండి కుడకుడ రోడ్, కొత్త బస్టాండ్, తెలంగాణ తల్లి విగ్రహం, యం.జి రోడ్, శంకర్ విలాస్ సెంటర్, రైతు బజార్ మీదుగా సద్దుల చెరువు వద్దకు ర్యాలీ చేరుకుంది. అనంతరం అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మీదట అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని రరెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను వేదిక పై ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధన కొరకు జరుగుతున్న ఉద్యమ సమయంలో కేంద్రం పన్నిన కుట్రలకు, విపక్షాలు చిందిన విషపు రాజకీయాలకు వారు ఆత్మలను బలిదానమిచ్చారని ఆయన తెలిపారు. వైరి వర్గాలు అనుకున్న చంద్రబాబు, వైఎస్‌ఆర్ లు తెలంగాణ అంశంలో ఒక్కటై చేసిన కుయుక్తులు కూడా వారి బలిదానాలకు కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రకటన వెలువడిన మీదట వైరి వర్గాలు ఒక్కటై తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలు ఏకం కావడం కూడా వారి బలిదానాలకు కారణాలలో ఒకటని ఆయన చెప్పారు. అటువంటి అమరవీరుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందడండలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

అమరవీరులను స్మరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల దినోత్సవం ఏర్పాటు చేసిందన్నారు. త్యాగాల పునాదుల మీదనే రాష్త్ర సాధన సాధ్యమైందన్నారు. రాష్ట్ర సాధనలో ఉద్యమ పార్టీని చీల్చి తెలంగాణ ఉద్యమాన్ని తీరుగార్చేందుకు చేసిన ప్రయత్నాలు ఆయన వివరించారు. వాటన్నింటిని అధిగమించి ఉద్యమ తొలి ప్రస్థానంలో ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పక్కకు తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అన్న మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని సాధించారని ఆయన కొనియాడారు. రాష్త్రంలో తొమ్మిదేళ్లుగా సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. అమర వీరుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంఅన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందన్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందో అక్కడి నుండే దశాబ్ది ఉత్సవాలు మొదలుపెట్టామని అన్నారు, విధానాలు రూపొందించడం వరకే పాలకుల పాత్ర ఉంటుందని, అమలు పరచాల్సిన పాత్ర అధికారులదే అన్నారు.

అటువంటి విధానాలు అమలు పరచడంలో ప్రభుత్వ ఉద్యోగులు రేయింబవళ్లు శ్రమించినందునే 21 రోజుల పాటు నిరంతరంగా సాగిన రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు విజయవంతంగా సాగాయని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, రాజ్యసభ సభ్యులు బడులు లింగయ్య యాదవ్, మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పి వైస్ ఛైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, డిసిఎంఎస్ ఛైర్మన్ వట్టె జానయ్య యాదవ్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News