Saturday, May 4, 2024

అమరుల త్యాగాలు ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయి

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ : తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

దశాబ్ది వేడుకల్లో నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నంను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభోత్సవం చేస్తున్నారన్నారు. ఆత్మ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో పాలన పగ్గాలు అందుకున్న ఉద్యమనేత కెసిఆర్ సర్కార్ అమరుల కుటుంబాలకు అడుగడుగున అండగా నిలుస్తూ ఆసరానిస్తుందన్నారు.

రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్లలోనే అక్కున చేర్చుకుందని, అమరుల కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున ఆర్థి సహాయం అందజేయగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలతో కూడిన ఉద్యమ ట్యాగ్‌లైన్‌ను పరిపూర్ణం చేస్తూ సాగుతుండడంపై నేడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, బిఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News