Wednesday, May 8, 2024

విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేవు

- Advertisement -
- Advertisement -

వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దయ, ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతర పర్యవేక్షణతో ఇప్పటి వరకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకాలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు అన్నారు.

సోమవారం వేములవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణనీయంగా విద్యుత్ వాడకం పెరగటంతో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా 15,497 మెగావాట్ల విద్యుత్‌ను నిరంతరాయంగా అందించగలిగామన్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడంలో 18 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం వచ్చినా ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలుగుతామన్నారు. అదే విధంగా వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు.

గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలో రోజుకు 3,500 నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. అందుకు అనుగుణంగా రోజుకు రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్లు వెచ్చించి విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అదే విధంగా రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని రాజకీయాలతో మాకు ఎటువంటి సంబంధం లేదని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పంటలు ఎండినట్లు తమ దృష్టికి రాలేదన్నారు.

అంతకుముందు శ్రీ రాజరాజేశ్వరస్వామిని ప్రభాకర్‌రావు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు దంపతులకు సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కోడె మొక్కులు చెల్లిం చుకున్న అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో కృష్ణప్రసాద్ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతి రావు, సిరిగిరి శ్రీరాములు, సెస్ ఎండి. రామకృష్ణ, రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సెస్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News