అమరావతి: తెలుగు రాష్ట్రాలలో ఎన్నడూ లేని విధంగా టమాట ధరలు ఆకాశన్నంటుతుండటంతో టమాటలనూ దొంగల ముఠాల కన్నుపడింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు కూరగాయల మార్కెట్లో ఓ రైతుకు చెందిన రూ.12 వేల విలువ చేసే టమాలను దొంగలు చోరీ చేశారు. పెనుగంచిప్రోలు కూరగాయల మార్కెట్లో టామాట ట్రేలు మాయమయ్యాయి. మార్కెట్లో వ్యాపారం చేసుకొని వ్యాపారస్తులు ఆ తర్వాత ఇంటికి వెళ్లిన క్రమంలో ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దొంగలు రాత్రి సమయంలో ఆరు ట్రేలలోని టమాటలను దొంగిలించారు. కాగా ఒక్కొక్క టమాల ట్రే దాదాపు రూ.2000 పైగా ఉంటుందని బాధితులు వాపోతున్నారు.
నెల రోజులు కష్టపడి కూరగాయలు అమ్ముకున్న ఆరువేల రూపాయలు కూడా గిట్టవని అలాంటిది రూ. 12 వేలు విలువగల టమాటా ట్రేలు మాయమవటంతో వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. మార్కెట్లో టమాటలు చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇదిలావుండగా ఎపి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సహా అన్ని రాష్ట్రాల్లో కిలో టమాట ధరలు రూ.130 నుంచి 150 వరకు పలుకుతున్నాయి. వర్షాల ప్రభావంతో టమాట డిమాండ్ మరింత పెరిగింది. అయితే మార్కెట్లల్లో టమాటకు భారీగా డిమాండ్ ఉండటంతో దొంగలు వాటిపై కన్నేశారని పోలీసులు పేర్కొంటున్నారు. టమాటాలతో భారీగా డబ్బు సంపాదించుకోవచ్చని దొంగతనం చేశారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు