మనతెలంగాణ/హైదరాబాద్ : తహసీల్దార్ కూతురు చికిత్స కొరకు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) హెల్పింగ్ -హాండ్స్ గ్రూప్ ఆర్థిక సాయాన్ని అందించడానికి ముందుకొచ్చింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల తహసీల్దార్ కృష్ణయ్య కూతురు (5సంవత్సరాలు ) మెదడు సంబంధిత వ్యాధితో కొన్ని రోజులుగా బాధపడుతోంది. పాప చికిత్స కోసం ఇప్పటి వరకు కృష్ణయ్య రూ. 25 లక్షలను ఖర్చు చేశారు. ఇంకా సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని యశోద ఆసుపత్రి డాక్టర్లు కృష్ణయ్యతో తెలిపారు. అంత ఖర్చు భరించే ఆర్థిక స్థోమత ఆయన దగ్గర లేకపోవడంతో ఆయన ఇబ్బం దులను తెలుసుకున్న నల్గొండ జిల్లాకు చెందిన తహసీల్దార్లు జి.దేశ్యా, పి.రాధ, కె.కృష్ణారెడ్డి తదితరులు చొరవ తీసుకొని రాష్ట్రంలోని మిగతా తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులతో హెల్పింగ్ హాండ్స్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా రూ.5 లక్షలను సమీకరించారు.
ఈ నగదును సోమవారం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ కేంద్ర కార్యాల యంలో రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ చేతుల మీదుగా తహసీల్దార్ కృష్ణయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కె. రామకృష్ణ, కార్యదర్శి బాణాల రాంరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.దేశ్యా, రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణయ్య కూతురు చికిత్స కోసం నిధుల సమీకరణకు చొరవ తీసుకున్న దేశ్యా, రాధ, కృష్ణారెడ్డి తదితరులని అభినందిస్తూ, సమయానికి ముందుకొచ్చి సహాయం చేస్తున్న తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులకు ట్రెసా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆ చిన్నారి చికిత్సకు సాయం అందించడానికి తాము కృషి చేస్తామని రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఇక ముందు రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటే హెల్పింగ్ -హాండ్స్ గ్రూప్ ద్వారా ట్రెసా అండగా ఉంటుందని రాష్ట్ర నాయకులు ప్రకటించారు.