డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ను విజేతగా ఎలెక్టోరల్ కాలేజ్ ప్రకటించిన తర్వాతే తాను వైట్ హౌస్ను ఖాళీ చేస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గురువారం వైట్ హౌస్లో జరిగిన ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బైడెన్ను విజేతగా ఎలెక్టోరల్ ప్రకటిస్తే అది ఘోర పొరపాటు అవుతుందని వ్యాఖ్యానించారు. వోటింగ్లో మోసాలు జరిగాయన్న తన ఆరోపణలకు తాను కట్టుబడి ఉంటున్నట్లు ఆయన చెప్పారు. బైడెన్ గెలుపును ఎలెక్టోరల్ కాలేజ్ ప్రకటించిన పక్షంలో ఆ విషయాన్ని అంగీకరించడం తన వల్ల కాదని ఆయన అన్నారు. అదే జరిగితే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదని ఆయన చెప్పారు. వైట్ హౌస్ను వీడతారా అన్న విలేకరుల ప్రశ్నకు తప్పకుండా వీడతానని చెప్పారు. వైట్ హౌస్లో తన చివరి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంపై ఒక ప్రశ్నకు జవాబిస్తూ అది తన రెండవ పదవీ కాలానికి మొదటి కార్యక్రమం కావచ్చని వ్యాఖ్యానించారు.
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్పై బైడెన్ విజయం సాధించినప్పటికీ తన విజయాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు ఆయన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు. బైడెన్కు అధికారాన్ని బదిలీ చేసే అధికారిక ప్రక్రియకు ట్రంప్ అంగీకరించినప్పటికీ తన ఓటమిని మాత్రం ఆయన ఒప్పుకోవడం లేదు. అయితే, ఎలెక్టోరల్ కాలేజ్లో బైడెన్కు 232 ఓట్లు లభించి విజయం సాధించినట్లు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు అనధికారికంగా ఇప్పటికే ప్రకటించాయి. కాగా ఈ ఎన్నికలను భారీ మోసంగా ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల వ్యవస్థను, ఓటింగ్ ప్రక్రియను ప్రస్తావిస్తూ ట్రంప్ మనం ఇంకా వర్ధమాన దేశాల తరహాలో ఉన్నామంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.