నాకు లభించిన చికిత్సే ప్రజలందరికీ
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: తనకు కరోనా వైరస్ సోకడాన్ని అయాచిత వరంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. కరోనా వైరస్ సోకడంతో సైనిక అసుపత్రిలో చికిత్స పొందిన ట్రంప్ తాను పూర్తిగా కోలుకున్నట్లు గురువారం ప్రకటించారు. తాను ఆసుపత్రిలో చేరడం మంచిదైందని, కరోనాను కట్టడి చేసే మందు తనకు దేవుడి దయ వల్ల దొరికిందని ఒక వీడియో సందేశంలో ఆయన తెలిపారు. తనకు లభించిన చికిత్సే ప్రజలందరికీ ఉచితంగా అందచేసేందుకు చర్యలు తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. వైట్ హౌస్లోని తన కార్యాలయం వెలుపల ఉన్న రోస్ గార్డెన్ వద్ద నిలబడి మాట్లాడిన ఆయన తాను వేగంగా కోలుకోవడానికి రెజినెరాన్ డ్రగ్తోపాటు ఇతర మందులు తోడ్పడ్డాయని చెప్పారు. రెజినెరాన్ డ్రగ్తోపాటు ఎలి లిల్లీ అనే ఫార్మసీ కంపెనీ తయారు చేసే అదే విధమైన డ్రగ్ను పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. రెజినెరాన్ డ్రగ్ను సైన్యం ద్వారా ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. తనకు లభించిన చికిత్స తరహాలోనే ప్రజలందరికీ ఉచిత చికిత్స అందుబాటులోకి తెస్తానని ఆయన తెలిపారు.
ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్కు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన మరుసటి రోజు గత శుక్రవారం వాల్టర్ రీడ్ నేషనల్ మెడికల్ సెంటర్లో ట్రంప్ అడ్మిట్ అయ్యారు. గత సోమవారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఆయన తన కార్యాలయానికి వెళ్లి కరోనా వైరస్ నివారణపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తాను ఆసుపత్రికి వెళ్లినపుడు తాను ఆరోగ్యంగా లేనని, అయితే 24 గంటల్లో తన ఆరోగ్యం బాగా మెరుగుపడిందని ట్రంప్ తెలిపారు. వెంటనే ఆసుపత్రి నుంచి బయటపడాలనుకున్నానని, కరోనా వైరస్ సోకిన వారందరికీ ఆ విధంగానే చికిత్స అందాలని తాను ఆశిస్తున్నానని ఆయన చెప్పారు.
గడచిన నాలుగు రోజులకు పైగా ట్రంప్కు జ్వరం లేదని, ఆయన ఆక్సిజన్ లెవల్స్ తదితర ప్రాథమిక ఆరోగ్య లక్షణాలు నిలకడగా ఉన్నాయని వైట్ హౌస్ పిజీషియన్ డాక్టర్ సీన్ కాన్లీ బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. గడిచిన 24 గంటలుగా ఆయన ఎటువంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ఆయనకు కృత్రిమ శ్వాస అందచేసే అవసరం రాలేదని ఆయన తెలిపారు.