Tuesday, April 30, 2024

కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌కు ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓ కీలక ఒపీనియన్ పోల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకే మద్దతు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఏడు రాష్ట్రాల్లో సర్వే చేయగా, ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌నకే మద్దతు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. బైడెన్ పనితీరుపై కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నట్టు ఓటర్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థంపై సందేహం వ్యక్తం చేసినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ తేల్చింది. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆరు నుంచి ఎనిమిది పర్సంటేజి పాయింట్లు ఆధిక్యం లభించినట్టు తెలిపింది.

పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవడా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ఈ రాష్ట్రాలే అత్యధికంగా ప్రభావితం చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఒక్క విస్కాన్సిన్‌లో మాత్రమే ట్రంప్ కంటే బైడెన్ మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారు. సర్వే చేసిన అన్ని రాష్ట్రాల్లో బైడెన్ పనితీరుపై అసంతృప్తి ఉన్నవారే అధికంగా ఉండడం గమనార్హం. అదే ట్రంప్ విషయంలో మాత్రం ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పనితీరు బాగుందని ఆరు రాష్ట్రాల్లోని ఓటర్లు అభిప్రాయ పడ్డారు. ఒక్క అరిజోనాలో మాత్రమే ఆయనకు నెగెటివ్ మార్కులు వచ్చాయి. మరోవైపు ప్రధాన పోల్స్‌ను నిరంతరం పర్యవేక్షించే “రియల్ క్లియర్ పాలిటిక్స్” మాత్రం బైడెన్, ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని తెలిపింది. ప్రధాన పోల్స్ సగటు ఆధారంగా బైడెన్ కంటే ట్రంప్ 0.8 పర్సంటేజీ పాయింట్లతో ముందంజలో ఉన్నట్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News