Tuesday, April 30, 2024

నేడు కానిస్టేబుల్ రాతపరీక్ష

- Advertisement -
- Advertisement -

TS Constable written exam today

నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న కానిస్టేబుల్ ప్రాధమిక రాత పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1601 పరీక్ష కేంద్రాలలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరగనున్న కానిస్టేబుల్ అభ్యర్థులు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎవరినీ అనుమతించవద్దని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో సివిల్ ఇతర విభాగాల్లో 15644, ట్రాన్స్‌పోర్టు- 63, ఎక్సైజ్‌లో 614 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నియామక బోర్డు గత ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు హాజరు కానున్నారని, అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిదని వివరిస్తున్నారు.

ఎలక్ట్రానిక్ వస్తువుల నిషేధం 

కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులను మాత్రమే తెచ్చుకోవాలని, అభ్యర్థులు వెంట సెల్‌ఫోన్, వాచ్, క్యాలిక్కులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, ఖాళీ పేపర్లతో కేంద్రాలకు వెళ్లడం అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్‌టికెట్‌ను భద్రంగా ఉంచుకోవాలని, అభ్యర్థులు ఎలాంటి అభరణాలు ధరించకూడదు. హ్యాండ్ బాగ్స్, పౌచ్ వంటి వస్తువులను పరీక్ష హాల్‌లోకి తీసుకోకూడదని తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలు 

కానిస్టేబుల రాత పరీక్ష కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయనన్నారు. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లోని రహదారులలో ఎలాంటి ట్రాఫిక్ ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నియమాలు ఉండనున్నాయి.ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి నగర జాయింట్ సిపిలు రమేశ్, రంగనాథ్, కార్తికేయ, విశ్వ ప్రసాద్‌లతో కలిసి నగర పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈక్రమంలో హైదరాబాద్ నగరంలో 91 కేంద్రాలలో రాత పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్షల తరువాత ఈవెంట్స్ 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీగా కానిస్టేబుల్ నియామకాల కోసం ఈ పరీక్ష జరుగుతోంది. కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధమయ్యే అభ్యర్థులకు ముందుగా ప్రిలిమ్స్, తర్వాత ఈవెంట్స్ ఉంటాయని, వీటిలో క్వాలిఫై అయితేనే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మొత్తం 200 మార్కులు ఇందులో అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 100 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్‌లో 20 మార్కులు ఉంటాయి. ఇదిలావుండగా కానిస్టేబుల్ అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకున్న సమయంలో అప్‌లోడ్ చేసిన ఫోటో కాకుండా వేరే ఫోటో అతికించినా లేదా హాల్‌టికెట్ సరిగ్గా లేకున్నా పరీక్షకు అనుమతి ఉండదని అధికారులు వివరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News