Monday, April 29, 2024

దేశానికే మోడల్ గా టిఎస్ ఆర్టీసి

- Advertisement -
- Advertisement -

సిబ్బంది సమష్టి కృషి వల్లే సంస్థకు సత్ఫలితాలు
ఈ నెల 15 నుంచి ‘గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్’
ఈ డిసెంబర్‌లోగా 1000 కొత్త డీజిల్ బస్సులు
టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ వెల్లడి
ఘనంగా ఛాలెంజ్ అవార్డుల ప్రదానోత్సవం

మనతెలంగాణ/హైదరాబాద్:  వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన టిఎస్ ఆర్టీసి దేశానికే మోడల్ గా నిలిచిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్, ఐపిఎస్ అన్నారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని టిఎస్ ఆర్టీసి కళాభవన్‌లో శనివారం శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్‌లతో పాటు జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్‌ట్రా మైల్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

ఈ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ హాజరయ్యారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. రాఖీ పౌర్ణమి ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రీజయన్లకు ట్రోఫీలను ఆయన అందజేశారు. మొత్తం 286 మందికి అవార్డులు వరించగా వారిలో రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ కు 36 మంది, శ్రావణ మాసం ఛాలెంజ్‌లో 30 మంది, జోనల్ స్థాయి ఉద్యోగులు 180 మంది, ఎక్స్ ట్రా మైల్ లో 25 మంది, లాజిస్టిక్స్ విభాగంలో 15 మంది ఉద్యోగులు ఉన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్‌లతో పాటు సూపర్‌వైజర్స్, డిపో మేనేజర్స్, డిప్యూటీ ఆర్‌ఎంలు, ఆర్‌ఎంలు ఇలా అన్ని విభాగాల ఉద్యోగులకు ఈ పురస్కారాలను అందుకున్నారు.
సిబ్బంది కృషి ఎనలేనిది
ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. క్లిష్ట పరిస్థితులను తట్టుకొని తన కాళ్ల మీద తాను నిలబడే స్థాయికి సంస్థ ఎదగడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రస్థానంలో సిబ్బంది కృషి ఎనలేనిదని ఆయన పేర్కొన్నారు. సంస్థ విసిరిన ప్రతి ఛాలెంజ్ ను సిబ్బంది విజయవంతం చేశారన్నారు. రాఖీ పౌర్ణమికి రికార్డుస్థాయిలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రావడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇంతమొత్తంలో ఆదాయం రాలేదన్నారు. శ్రావణ మాసంలో ఛాలెంజ్ లోనూ గతేడాదితో పోల్చితే అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ రికార్డుల్లో భాగమైన సిబ్బందికి అభినందనలు తెలియ జేశారు. నిజాయతీగా, నిబద్దతతో ఉత్తమ సేవలందించే అధికారులు, ఉద్యోగులే సంస్థకు నిజమైన బ్రాండ్ అంబాసిండర్లని ఆయన పేర్కొన్నారు.
15వ తేదీ నుంచి జనవరి వరకు గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్
రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకమని ఎండి తెలిపారు. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతితో పాటు శుభము హుర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలన్న ఉద్దేశంతోనే 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ను నిర్వహించాలని టిఎస్ ఆర్టీసి యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ వరకు ఈ ఛాలెంజ్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. గత ఛాలెంజ్ ల మాదిరిగానే పనిచేసి ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలని సజ్జనార్ కోరారు. పండుగ సమయాల్లో పోలీస్, రవాణా శాఖలు సంస్థకు ఎంతగానో సహకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సంస్థ కష్టకాలంలో ఉన్నప్పటికీ 2017 నుంచి విడతల వారీగా పెండింగ్ లో ఉన్న 9 డిఏలను ఉద్యోగులకు సంస్థ మంజూరు చేసిందన్నారు. బకాయిల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సంస్థ ఇవ్వాల్సిన ఏరియర్స్, సిసిఎస్ నిధులు, బాండ్లకు సంబంధించిన ప్రతి రూపాయిను కూడా చెల్లిస్తామన్నారు. ఈ నవంబర్, డిసెంబర్ నుంచి 1000 కొత్త డీజిల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తున్నామన్నారు. రాబోయే కాలంలో హైదరాబాద్‌లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్లాన్ చేసినట్లు వివరించారు.
అత్యుత్తమ ప్రదర్శనకు నగదు పురస్కారాలు
రాఖీ పౌర్ణమి ఛాలెంజ్‌లో పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్ (రూ.లక్ష) సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ(రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ కరీంనగర్(రూ.50 వేలు) దక్కాయి. శ్రావణ మాసం ఛాలెంజ్‌లో పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్(రూ.లక్ష), సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ (రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ ఆదిలాబాద్(రూ.50 వేలు) దక్కాయి. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, సిఎంఈ రఘునాథరావు, సిఎఫ్‌ఎం విజయ పుష్ఫ, సిసిఓఎస్ విజయ భాస్కర్, సీసీఈ రాంప్రసాద్, సీటీఎం (కమర్షియల్) సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

RTC 1

RTC 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News