Friday, May 3, 2024

త్వరలోనే 8,300 బస్సుల్లో దశల వారీగా ఐ- టిమ్స్ యంత్రాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశల వారీగా ఐ- టిమ్స్ యంత్రాలను ప్రవేశపెట్టేలా టిఎస్ ఆర్టీసి కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే బండ్లగూడ బస్‌డిపోను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ -టిమ్స్ యంత్రాలను వాడేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఐ- టిమ్స్ యంత్రాల వల్ల టికెట్ డబ్బులు అవసరం లేకుండా డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటిఎం వంటి వాటితో చెల్లింపులు చేసి టికెట్ ఇస్తున్నారు. ప్రస్తుతం బండ్లగూడ అనంతరం కంటోన్మెంట్ డిపోలో పూర్తిస్థాయిలో ఐ- టిమ్స్ యంత్రాలను అమల్లోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.

చిల్లర సమస్యలకు చెక్ పెట్టే విధంగా
ఆర్టీసి బస్సు ప్రయాణాల్లో చిల్లర ప్రధాన సమస్యగా ఉండేది. టికెట్‌కు సరిపడా చిల్లర డబ్బులు ఇవ్వకపోవడంతో బస్సులో కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య గొడవలు జరుగుతుండేవి. కొన్నిసార్లు దాడులకు కూడా కారణమయ్యేది. అయితే ఈ చిల్లర సమస్యలకు చెక్ పెట్టే విధంగా పలు ప్రయత్నాలను అవలంభిస్తోంది. అయినా ఈ సమస్యకు పరిష్కారం పూర్తిగా లభించకపోవడంతో ఐ- టిమ్స్ యంత్రాలతో దీనిని పూర్తిగా అరికట్టవచ్చని ఆర్టీసి అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ యంత్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్సుల్లో ప్రవేశపెట్టాలన్న కృతనిశ్చయంతో ఆర్టీసి అధికారులు ముందుకెళుతున్నారు. దీంతో కొన్ని బస్సుల్లో ఇప్పటికే ఐ- టిమ్స్ యంత్రాలను ప్రవేశపెట్టారు.

దూరప్రాంతాలు, అధిక ఛార్జీలు ఉండే బస్సుల్లో
దూరప్రాంతాలు, అధిక ఛార్జీలు ఉండే సూపర్ లగ్జరీ, ఎసి బస్సుల్లో ఐ-టిమ్స్ ద్వారా నగదు రహిత (క్యాష్‌లెస్) లావాదేవీల ద్వారా టికెట్లు ఇస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటిఎం వంటి వాటితో చెల్లింపులు చేసి టికెట్ తీసుకుంటున్నారు. అయితే ఈ విధానాన్ని అన్ని రకాల బస్సుల్లో ప్రవేశపెట్టాలని టిఎస్ ఆర్టీసి భావిస్తోంది. త్వరలో రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింట్లో ఐ- టిమ్స్ పరికరాలను అందుబాటు లోకి తెచ్చేందుకు ఆర్టీసి సమాయత్తమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News