Wednesday, May 15, 2024

హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం ఆ రెండు జిల్లాలు ఎంపిక…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రులు తెలిపారు. తెలంగాణలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుపై మంత్రులు సమీక్ష జరిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం ములుగు, సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేశామన్నారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే వారికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టడంలో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. తక్షణ వైద్యం కోసం హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతోందన్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఐటి శాఖ ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ సేవలను ఆన్లైన్ మరియు మొబైల్ ప్లాట్ ఫామ్ పైన అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఐటిశాఖ మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు. టెక్నాలజీ సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, అత్యంత సులభంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారానికి సంబంధించిన కనీస సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఆ శాఖ పరిధిలో చేపట్టేటువంటి భవిష్యత్తు ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక అవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషణ చేయడం వలన వివిధ జిల్లాల్లో ప్రత్యేకించి ఉన్న వ్యాధులు మరియు సీజనల్ వ్యాధుల హెల్త్ ట్రెండ్స్ ని గుర్తించవచ్చని తెలియజేశారు. తద్వారా ఆయా ఆరోగ్య సమస్యలకు అవసరమైన నివారణ మరియు చికిత్సకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల లాంటి సమయాల్లో అత్యవసర చికిత్స అందించేందుకు ప్రజల ప్రాథమిక సమాచారం సహాయ పడుతుంది అన్నారు.
అయితే ఇంత భారీ ప్రాజెక్టు చేపట్టే ముందు రాష్ట్రంలో చిన్న జిల్లాలైన ములుగు, సిరిసిల్ల లను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నామన్నారు. ముందుగా ఈ రెండు జిల్లాల్లో ఉన్న వైద్య శాఖ సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను ప్రజల ఇంటివద్దనే సేకరిస్తామన్నారు. ముఖ్యంగా బిపి, షుగర్, యూరిన్ మరియు వివిధ రక్త పరీక్షల వివరాలను అక్కడికక్కడే క్షేత్రస్థాయిలో సేకరిస్తామన్నారు. ఎవరికైనా అదనపు పరీక్షలు అవసరం తలెత్తితే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల ద్వారా ఆయా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని మరియు పరికరాలను అందిస్తామన్నారు. ఇలాంటి హెల్త్ ప్రొఫైల్ రికార్డుని ఇప్పటికే పూర్తిచేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేయాలని సూచించారు.
ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లాను ఎంచుకోవడం ద్వారా అక్కడి స్థానికులకు అనేక ఉపయోగాలు కలుగుతాయని వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు తెలిపారు. ముఖ్యంగా గిరిజన జనాభా అధికంగా ఉండే ఈ జిల్లాలో ప్రజలకు అత్యవసరమైన ఆరోగ్య సేవలను అందించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రాజెక్టు వివరాలను మంత్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా తాము చేపట్టబోయే పైలెట్ ప్రాజెక్టు పైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి మంత్రులు ఇచ్చిన పలు సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని మరో వారం రోజుల్లో పూర్తి మార్గదర్శకాలతో ఒక నివేదిక అందిస్తామని అధికారులు మంత్రులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైద్య శాఖ ఉన్నతాధికారులు సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి, వాకటి కరుణ, శ్రీనివాస్ రావు, రమేష్, గంగాధర్, ఐటి శాఖ ఉన్నతాధికారులు జయేష్ రంజన్, జి. వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News