ప్రారంభోత్సవాలు సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఈ నెలలోనే
ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశాలు
మొదటి వారంలో సిద్దిపేట, నిజామాబాద్, రెండో వారంలో కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మూడో వారంలో వరంగల్, జనగాం, పెద్దపల్లి నాల్గో వారంలో వికారాబాద్, మేడ్చల్ కలెక్టరేట్లు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: 100 శాతం నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న కలెక్టర్ భవనాలను ఈనెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులతో మినిస్టర్ క్వార్టర్స్లో తన అధికార నివాసంలో నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సిఎం కెసిఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణాన్ని చేపట్టారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, పరిపాలన సులభతరం చేయాలన్నది సిఎం కెసిఆర్ ఆలోచన అని, అందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని కార్యాలయాలు ఒకే గొడుగు కిందకు తెచ్చేలా నూతన కలెక్టరేట్ల భవన సముదాయాల నిర్మాణాలను చేపట్టామన్నారు.
ఈ నెల మొదటివారంలో సిద్ధిపేట, నిజామాబాద్, రెండోవారంలో కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మూడోవారంలో వరంగల్, జనగాం, పెద్దపల్లి, నాలుగో వారంలో వికారాబాద్, మేడ్చల్ జిల్లాల నూతన కలెక్టరేట్లు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో నిర్మాణ పూర్తిదశలో ఉన్న మరికొన్ని కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి వేముల అధికారులను ఆదేశించారు. వనపర్తి, మహబూబాబాద్, మెదక్, నాగర్కర్నూల్, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల కలెక్టరేట్ల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఈఎన్సీ గణపతిరెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈలు, ఈఈలు, వాస్తు నిపుణులు, సుధాకర్తేజ, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.
Vemula Prashanth meeting with officials on Collectorates work